డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2020-12-10T08:45:06+05:30 IST
పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ర్టో ఎంటరాలజీ(ఏఐజీ) చైౖర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. నోబెల్
![డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి అరుదైన గౌరవం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ప్రఖ్యాత ‘ఏఏఏఎస్’ ఫెలోషి్పకు ఎంపిక
50 ఏళ్ల తర్వాత భారతీయుడికి దక్కిన విశిష్ఠ గౌరవం
జీర్ణకోశ వ్యాధులకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నందుకు గుర్తింపు
నా బాధ్యత మరింత పెరిగింది : డాక్టర్ నాగేశ్వర్రెడ్డి
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ర్టో ఎంటరాలజీ(ఏఐజీ) చైౖర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ పురస్కార గ్రహీతలు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు మాత్ర మే ఫెలోషిప్ లభించే ‘అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ (ఏఏఏఎ్స)’లో చోటు లభించింది. జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికిగానూ ఫెలోషిప్ అందజేస్తున్నట్లు ఏఏఏఎస్ ప్రకటించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఏఏఏఎస్ సంస్థలో స్థానం పొందిన అరుదైన వైజ్ఞానిక నిపుణుల్లో నాగేశ్వర్రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఐదు దశాబ్దాల అనంతరం ఏఏఏఎస్ ఫెలోషిప్ సాధించిన తొలి భారతీయుడు నాగేశ్వర్ రెడ్డి కావడం విశేషమని పలువురు వైద్య ప్రముఖులు కొనియాడారు. 2021 ఫిబ్రవరి 13న నిర్వహించనున్న కార్యక్రమంలో అధికారిక ధ్రువపత్రంతోపాటు జ్ఞాపికను ఆయనకు ప్రదానం చేయనున్నారు.
విఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్తో మొదలు..
ఏఏఏఎస్ ఫెలోషిప్ 1874 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. విద్యుత్ బల్బును కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్కు 1878లో ఈ ఫెలోషి్పను ప్రదానం చేశారు. ఆంథ్రోపాలజిస్ట్ మార్గరేట్ మేడ్కు 1934లో, సోషియాలజిస్ట్ డబ్ల్యు.ఈ.బీ. డూ బాయి్సకు 1905లో ఫెలోషి్పను ప్రకటించారు. ఈ ఏడాదికిగానూ ప్రపంచవ్యాప్తంగా 489 మందికి ఫెలోషిప్ దక్కింది. వైజ్ఞానిక, సామాజిక, మానవ శాస్త్ర రంగాల్లో విశిష్ట పరిశోధనలతో సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న వారిని గుర్తించి ఏఏఏఎస్ ఫెలోషి్పకు ఎంపిక చేస్తుంటుంది. నాగేశ్వర్రెడ్డి జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి అత్యాధునిక పరిజ్ఞానంతో అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు. అరుదైన ఫెలోషిప్ దక్కడంపై ఆనందం వ్యక్తం చేసిన నాగేశ్వర్రెడ్డి.. జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి చికిత్సలపై పరిశోధనలు కొనసాగిస్తానని చెప్పారు. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. నాగేశ్వర్రెడ్డికి ఫెలోషిప్ దక్కడంపై ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల అనంతరం ఓ భారతీయ వైద్యుడికి ఈ అరుదైన గౌరవం దక్కడం గర్వకారణమన్నారు.