ఐసెట్లో 90.27 శాతం ఉత్తీర్ణత
ABN , First Publish Date - 2020-11-03T10:10:45+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి
సత్తాచాటిన అబ్బాయిలు
నగరానికి చెందిన ఎడ్ల ప్రసన్నలక్ష్మికి నాలుగో ర్యాంకు
కేయూ క్యాంపస్, నవంబరు 2: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్లో మొత్తం 90.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పురుషులు 90.85, స్ర్తీలు 89.71శాతం ఉత్తీర్ణత సాధించారు. టీఎస్ ఐసెట్కు 58,392 మంది దరఖాస్తు చేసుకోగా 12,417మంది గైర్హాజరయ్యారు. 45,975 మంది ఆన్లైన్లో పరీక్షలు రాయగా 41,506 మంది అర్హత సాధించారు. తెలంగాణ, ఏపీలో మొత్తం 80 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐసెట్కు ఆరుగురు ట్రాన్స్జెండర్స్ను దరఖాస్తు చేసుకోగా నాలుగురు పరీక్షలు రాసి అర్హత సాధించారు. ఓయూ పరిధిలో 90.12, ఏయూ పరిధిలో 95.02, ఎస్వీయూ 91.98, ఇతర యూనివర్సిటీల పరిధిలో 91.44 శాతం మంది అర్హత సాధించారు.
టాప్-10లో మొదటి, నాలుగవ ర్యాంకులు మహిళలు సాధించగా మిగతా ర్యాంకులను పురుషులే సొంతం చేసుకున్నారు. కేయూ క్యాంప్సలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో టీఎ్సఐసెట్-2020 కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి, రిజిస్ట్రార్ పురుషోత్తంతో కలిసి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ఐసెట్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు.
స్టేట్ ఫస్ట్ ర్యాంకును హైదరాబాద్కు చెందిన బి.శుభశ్రీ (200 మార్కులకు 159)) సాధించగా, రెండు, మూడు ర్యాంకులను నిజామాబాద్, హైదరాబాద్లకు చెందిన గైని సందీప్(144), అవినాశ్ సిన్హా (142)లు సాధించారు. నాలుగో ర్యాంకు వరంగల్ ఫోర్టు రోడ్డు రుద్రమనగర్కు చెందిన ఎడ్ల ప్రసన్నలక్ష్మి (142) సాధించారు. ఐదో ర్యాంకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నంకు చెందిన మాదవవోని శ్రీకృష్ణసాయి(141), ఆరో ర్యాంకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన తిప్పర్తి అఖిల్రెడ్డి(140), ఏడో ర్యాంకు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన జాయ్దీప్ డే(140), ఎనిమిదో ర్యాంకు ఆంధ్రప్రదేశ్కు చెందిన పత్తి అఖిల్రెడ్డి(139), తొమ్మిదో ర్యాంకు ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన ఈమని వీఎస్ రాజశేఖర్రెడ్డి (136), పదో ర్యాంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన మహ్మద్ సోహెల్ (135) సాధించారు. ఇక టాప్-20 స్థానాల్లో వల్లె వరుణ్, ఏకు శ్రీకృత్యకృష్ణారెడ్డి, ఐడ్ల వినోద్కుమార్రెడ్డి, కె.హారతి, కొగంటి ప్రతా్పసాయిచౌదరి, పగోలు శిరీష, ఆర్.వెంకటసాయువశిష్ఠ, డి.సాయికృష్ణకపిల్రెడ్డి, వట్టుమిల్లి కనకమాధవి, సి.రంజిత్ నిలిచారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని ఛైర్మన్ పాపిరెడ్డి, కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. వెబ్సైట్లో ఐసెట్ ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
డిగ్రీ ఫలితాల తర్వాతే అడ్మిషన్లు
కొవిడ్ కారణంగా డిగ్రీ పరీక్షలను అనేక వాయిదాల తర్వాత ఇటీవలే నిర్వహించారు. ఇంకా బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే డిగ్రీ ఫలితాలు వెల్లడించిన తర్వాతే ఐసెట్-2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ను వెల్లడించనున్నారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎంసీఏ 3వేల సీట్లు, ఎంబీఏలో 24వేల సీట్లు భర్తీచేశారు. ఈ ఏడాదికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తం 32 సీట్లు భర్తీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.