కల్లాల నిర్మాణానికి 750 కోట్లు
ABN , First Publish Date - 2020-06-16T09:50:42+05:30 IST
చేతికొచ్చిన పంటను రైతన్నలు రోడ్ల మీద, ఇళ్ల ముందర ఆరబోస్తుంటారు.

- ఉపాధి హామీ పథకంలో లక్ష యూనిట్లకు అనుమతి
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): చేతికొచ్చిన పంటను రైతన్నలు రోడ్ల మీద, ఇళ్ల ముందర ఆరబోస్తుంటారు. అన్నదాతలకు ఉపయోగంగా ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాల నిర్మాణం జరగనుంది. ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎ్స)లో డ్రైప్లాట్ ఫామ్స్(కల్లాలు) నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 32 గ్రామీణ జిల్లాల్లో వీటి నిర్మాణం కోసం రూ.750 కోట్లను కేటాయించింది. కల్లాల నిర్మాణాన్ని వాటి పరిమాణం ఆధారంగా మూడు సైజులుగా వర్గీకరించారు దీని ఆధారంగానే యూనిట్ ధరను నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రైతులు, ఎస్హెచ్జీ సభ్యులకు..
కల్లాలను రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్సహెచ్జీ) సభ్యులకు మంజూరు చేస్తారు. లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తారు. కనీసం 90 శాతం వారికి మంజూరు చేసి, మిగతా వాటిని ఇతరులకు ఇస్తారు. పని పురోగతిని బట్టి రెండు విడతలుగా చెల్లింపులు ఉంటాయి. దరఖాస్తులు స్వీకరించి, క్షేత్ర పరిశీలన అనంతరం లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తారు. మండలాలు, జిల్లాల వారీగా జాబితాలు తయారు చేస్తారు. అర్హుల జాబితా ఎక్కువగా ఉంటే.. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు.
యూనిట్లు ఇలా..
50 చ.మీటర్ల(538 చ.అడుగులు) ప్లాట్ఫాం, ధర రూ. 56,000
60 చ.మీటర్ల(645 చ.అడుగులు) ప్లాట్ఫాం, ధర రూ. 68,000
75 చ.మీటర్ల(807 చ.అడుగులు) ప్లాట్ఫాం, ధర రూ. 85,000