6 జిల్లాలు భేష్!
ABN , First Publish Date - 2020-04-21T08:22:08+05:30 IST
రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ కేసుల సంఖ్య పెరుగుతుండగా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కూడా నమోదవలేదు!

కరోనా మహమ్మారిపై పోరులో పైచేయి
వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసూ నమోదవలేదు!
మరో 3 జిల్లాల్లో స్వల్పంగా నమోదైనా
సమర్థంగా ఎదుర్కొన్న యంత్రాంగం
సిద్దిపేట, జనగామ, భద్రాద్రిల్లో సున్నా
పటిష్ఠ చర్యలతో వైరస్కు అడ్డుకట్ట
అధికారుల కృషి.. ప్రజల చైతన్యంతోనే
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్): రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ కేసుల సంఖ్య పెరుగుతుండగా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కూడా నమోదవలేదు! మరికొన్ని జిల్లాల్లో ఒకట్రెండు కేసులు నమోదైనప్పటికీ రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు! కొన్ని జిల్లాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవగా.. వరంగల్ రూరల్, యాదాద్రి భవనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదవకపోవడం విశేషం. ఇక జనగామ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో స్వల్ప సంఖ్యలో కేసులు నమోదైనా.. వైరస్ బారిన పడ్డవారు కోలుకొని డిశ్చార్జ్ కావడంతో ఈ జిల్లాలు కూడా వైరస్ రహిత జిల్లాలుగా మారిపోయాయి! ప్రపంచ దేశాలను, ముఖ్యంగా అమెరికాను సైతం వణికిస్తున్న ఈ వైర్సను తెలంగాణలోని ఈ ఆరు జిల్లాల్లో ఎలా కట్టడి చేశారు? అన్న అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గ్రీన్ జోన్ జిల్లాలుగా ఎలా మారాయంటే..?
అధికారుల కృషి, ప్రజల అప్రమత్తతతో వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదవలేదు. వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాల్లో కేసులు పెరుగుతున్నా వరంగల్ రూరల్ జిల్లాలో మాత్రం కొవిడ్-19 కేసు నమోదవకపోవడం విశేషం. అనుమానితులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు క్వారంటైన్కు తరలించారు. పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే కరోనాపై ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ ఇంటి పట్టునే ఉంటూ పట్టణవాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 100 మందిని గుర్తించిన అధికారులు, వారిని ఇళ్లకే పరిమితం చేయగలిగారు. ఫలితంగా ఆ 100 మందికి నెగెటివ్ వచ్చింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన 1,742 మందినీ ఇళ్లకే పరిమితం చేయగలిగారు. హోం క్వారంటైన్లో ఉన్న వారికి గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలతో పరీక్షలు నిర్వహించారు. ప్రజా చైతన్యం, అధికారుల కట్టుదిట్టమైన చర్యలతోనే కరోనాను అడ్డుకోగలిగినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. ఇక చుట్టూ వైరస్ వ్యాపిస్తున్నా యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ఒక్క కేసూ నమోదవలేదు. అనుమానితుల గుర్తింపు, పరీక్షలు, కట్టడి వంటి ప్రణాళికాబద్ధమైన చర్యలతో ప్రజలు వైరస్ బారిన పడకుండా జిల్లాను కరోనా రహితంగా ఉంచగలిగామని కలెక్టర్ అనితారామచంద్రన్ అంటున్నారు.
33 మంది విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను, 12 మంది మర్కజ్ వ్యక్తులను, ఇతర జిల్లాల నుంచి వచ్చిన నలుగురి వ్యక్తులతో పాటు 26మంది కాశీ యాత్రికులను గుర్తించి క్వారంటైన్ చేశారు. అందరికీ నెగెటివ్ వచ్చిందని, నలుగురి నివేదికలు మాత్రమే అందాల్సి ఉందని డీఎంహెచ్వో సాంబశివరావు తెలిపారు. వనపర్తి జిల్లాలో తొలుత విదేశాల నుంచి వచ్చిన 58 మందిని గుర్తించి క్వారంటైన్ చేశారు. తర్వాత మర్కజ్ వెళ్లి వచ్చిన పదిమందిని, అజ్మీర్కు వెళ్లి వచ్చిన 16 మందిని కూడా క్వారంటైన్ చేశారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రత్యేక చొరవ తీసుకొని త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు. మర్కజ్కు సంబంధించి 10 మంది, వారి కాంటాక్టులు 82 మంది నమూనాలు సేకరించగా అందరికీ నెగెటివ్ వచ్చింది.
ఆ మూడు జిల్లాల్లో..
జనగామ జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కోలుకొని డిశ్చార్జి అయి వారం రోజులు కావస్తుండగా ఇప్పటి వరకు మళ్లీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ మటన్ వ్యాపారితో పాటు ప్రభుత్వ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు, వారిని కలిసిన వారు 116 మందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారందరికీ నెగెటివ్ వచ్చింది. జిల్లా కలెక్టర్ కె.నిఖిల, డీసీపీ బి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఇక కరోనా నియంత్రణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం భేష్ అనిపించుకుంది. జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు రాగా.. వారంతా కోలుకున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ ఎంవీ రెడ్డి, జిల్లా ఎస్పీ సునీల్ దత్తోపాటు జిల్లా యంత్రాంగాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ భద్రాద్రి అధికారులను ప్రశంసించారు. ప్రస్తుతం భద్రాద్రి జిల్లా కరోనా రహిత జిల్లాగా మారింది. హరీశ్ చొరవ.. అధికారుల కృషితో సిద్దిపేట జిల్లా కూడా సేఫ్ జోన్లో ఉంది.