మూసివేత దిశగా 3వేల ప్రైవేటు స్కూళ్లు

ABN , First Publish Date - 2020-12-19T07:13:14+05:30 IST

రాష్ట్రంలోని బడ్జెట్‌ ప్రైవేటు విద్యా సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, అనేక పాఠశాలలు మూతబడటంతో యజమానులు నిరుద్యోగులుగా మారుతున్నారని తెలంగాణ

మూసివేత దిశగా 3వేల ప్రైవేటు స్కూళ్లు

వెంటనే అకడమిక్‌ క్యాలెండరును ప్రకటించండి

సీఎ్‌సతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం 

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బడ్జెట్‌ ప్రైవేటు విద్యా సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, అనేక పాఠశాలలు మూతబడటంతో యజమానులు నిరుద్యోగులుగా మారుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం పేర్కొంది. సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి శేఖర్‌ రావు, ఎస్‌. మధుసూదన్‌, ప్రతినిధులు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను శుక్రవారం కలిశారు.


రాష్ట్ర వ్యాప్తంగా 11వేల ప్రైవేటు బడ్జెట్‌ పాఠశాలలున్నాయని, వీటిలో 3వేల బడులు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నాయని తెలిపారు.  విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాకపోవడం, తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాల భవనాల అద్దె కూడా చెల్లించుకోలేని స్థితిలో ఉన్నాయని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు.  వెంటనే అకడమిక్‌ క్యాలెండరును విడుదలచేసి పాఠశాలలను ప్రారంభించాలని, ఎస్‌ఏ-2 పరీక్షల అనంతరమే విద్యార్థులను పై తరగతులకు నమోదుచేయాలని కోరారు.


పాఠశాలలు ప్రారంభించాక 1-9 తరగతులకు కనీసం 120 రోజులు తరగతులు నిర్వహించేలా చూడాలన్నారు. ఈ విద్యాసంవత్సరాన్ని జూలై వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల గుర్తింపును వచ్చే ఏడాదివరకు పొడిగించాలని కోరారు. ప్రతి విద్యార్థికి రూ.20వేల వోచర్‌ను అందించాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం 25శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించాలని సీఎ్‌సను కోరారు. 


Updated Date - 2020-12-19T07:13:14+05:30 IST