తెలంగాణ నుంచి వెళ్లింది 1030 మంది
ABN , First Publish Date - 2020-04-01T07:58:23+05:30 IST
కరోనా వైరస్ మీద విరామమెరుగక పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీలోని మర్కజ్ మసీదు సమావేశాలకు వెళ్లిన వారికి పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు తేలుతుండటం పెను సవాలుగా మారింది. తెలంగాణ నుంచి 1030

- మంది హాజరుగ్రేటర్ నుంచే 603మంది
- ఇప్పటికే 20 మందికి పాజిటివ్
- మరో 74 మందికి వ్యాధి లక్షణాలు
- వీరంతా పది రోజుల్లో 10 వేల
- మందిని కలిసినట్లు అంచనా
- వారంతా హోం క్వారంటైన్లోనే
- సచివాలయానికీ పాకిన సెగ
- ఢిల్లీ సభకు వెళ్లొచ్చి 2 వారాలుగా
- విధుల్లో సెక్షన్ ఆఫీసర్
- ఆయన శాఖ మొత్తం క్వారంటైన్
- రంగంలోకి ప్రత్యేక టాస్క్ ఫోర్స్
- ఢిల్లీ నుంచి జగిత్యాలకు లారీలో..
- 32 మంది హోం క్వారంటైన్కు
- మర్కజ్ మసీదు సమావేశానికి రాష్ట్రం నుంచి హాజరైంది వీరే
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
కరోనా వైరస్ మీద విరామమెరుగక పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీలోని మర్కజ్ మసీదు సమావేశాలకు వెళ్లిన వారికి పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు తేలుతుండటం పెను సవాలుగా మారింది. తెలంగాణ నుంచి 1030 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు వందల మందికి పైగా ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు తేలడం, వారి నుంచే ఆరు మరణాలు, పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు తేలడంతో రెండు రాష్ట్రాలు భారీ ఎత్తున అనుమానితుల అన్వేషణకు దిగాయి. తెలంగాణ ప్రభుత్వం మర్కజ్ మసీదు సమావేశాలకు వెళ్లిన వారందర్నీ యుద్ధ ప్రాతిపదికన క్వారంటైన్కు పంపుతోంది. మంగళవారమంతా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వారి అన్వేషణలోనే ఉంది. ఆ సమావేశానికి వెళ్లిన వారిని, వారి కుటుంబ సభ్యులను ఒప్పించి, నచ్చజెప్పి క్వారంటైన్కు తీసుకొస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి బంధువులు, కుటుంబ సభ్యులే స్వచ్ఛందంగా ఫోన్లు చేసి వివరాలు చెబుతున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 603 మంది ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు వెళ్లొచ్చారు. వారి కుటుంబాల్లో కొందర్ని పరీక్షించగా 74 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
ఇప్పటికే మర్కజ్ వెళ్లివచ్చిన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మరో ఆరుగురు మరణించారు. రాష్ట్రం నుంచి 1030 మంది ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లినట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి 603 మంది వెళ్లారు. నిజామాబాద్ నుంచి 80, వరంగల్ అర్బన్ నుంచి 38, ఆదిలాబాద్ నుంచి 30, ఖమ్మం నుంచి 27, నల్గొండ నుంచి 45, జగిత్యాల, నిర్మల్ల నుంచి 25 చొప్పున, సంగారెడ్డిలో 22 మంది, కరీంనగర్ నుంచి 17 మంది వెళ్లినట్లు గుర్తించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో 10 మందిలోపు ఉన్నారు. వీరిలో 70 శాతం మందిని ఇప్పటికే గుర్తించగా, 90 శాతం మంది ఫోన్ నంబర్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మిగిలిన వారికోసం వైద్య, పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కొందరు తప్పుడు చిరునామా ఇచ్చినట్లు గుర్తించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులను, వారితో సన్నిహితంగా ఉన్నవారిని కలిపి మొత్తం రెండు వేల కుటుంబాలను క్వారంటైన్లో ఉంచారు. అన్ని కుటుంబాలు కలిసి క్వారంటైన్లో ఉన్న వారు పదివేల మంది వరకు ఉంటారని అంచనా.
కేసులు బయటపడితే ఇప్పుడే
మార్చి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పలు దశల్లో 1030 మంది తెలంగాణ వాసులు ఢిల్లీకి వెళ్లారు. తొంభై శాతం మంది 16 నుంచి 22వ తేదీల మధ్య తిరిగి వచ్చారు. వారిలో కరోనా వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకు లోకల్ కాంటాక్ట్ కింద వైరస్ సోకి ఉంటే, 14 రోజుల్లో బయటకు వస్తుంది. అంటే, మార్చి 30 నుంచి ఏప్రిల్ 1, 2 తేదీల వరకు పెద్ద ఎత్తున కేసులు బయటపడాలి. అలా జరగక పోవడం ఓదార్పునిచ్చే విషయం.
మార్చి 18 నుంచే రంగంలోకి
రాష్ట్రానికి వచ్చిన ఇండోనేషియా బృందానికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మార్చి 18న గుర్తించారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. నాటి నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతి జిల్లాలను జల్లెడ పట్టాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి జాడను కనుగొన్నాయి. మార్చి 21నే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
జిల్లాల వారీగా ఐసోలేషన్
ఇప్పటికే గుర్తించిన వారందర్నీ అయా జిల్లాల్లోని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. లక్షణాలున్న వారికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబాలను కూడా క్వారంటైన్లో ఉంచారు. అన్ని కుటుంబాలకు కరోనా ర్యాండమ్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా ఢిల్లీకి వెళ్లిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి 6, ములుగు 2, నిజామాబాద్ 80, నిర్మల్ 25, నాగర్కర్నూల్ 4, జనగామ 4, ఆదిలాబాద్ 30, కొత్తగూడెం 11, నల్గొండ 45, నారాయణపేట 2, వికారాబాద్ 13, సిద్దిపేట 2, కామారెడ్డి 4, గద్వాల 5, కరీంనగర్ 17, ఖమ్మం 27, సిరిసిల్ల 4, సూర్యాపేట 10, సంగారెడ్డి 22, మంచిర్యాలలో 10, భూపాలపల్లి 1, మెదక్ 12, వరంగల్ అర్బన్ 38, రంగారెడ్డి 13.
అనధికారికంగా మరో 500 మంది?
ఢిల్లీ సభలకు రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం 550 మంది వెళ్లారని తబ్లీగీ జమాత్ నిర్వాహకుడు అక్రమ్ తెలిపారు. వారి వివరాలున్న రిజిస్టర్ను పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగించారు. అనధికారికంగా మరో 500 మంది వెళ్లినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తేల్చారు. పోలీసులు, బల్దియా అధికారులు, ఆశ, అంగన్వాడీ వర్కర్ల సాయంతో ఇళ్లకు వెళ్లి, కౌన్సెలింగ్ నిర్వహిస్తూ క్వారంటైన్ చేశారు. పాతబస్తీ, నాంపల్లి, మల్లేపల్లి, ఆసి్ఫనగర్, బంజారాహిల్స్, యూసు్ఫగుడా, బోరబండ, ఇతర ప్రాంతాల్లో గాలింపు జరిగింది.
రంగంలోకి టాస్క్ ఫోర్స్!
ఢిల్లీ వెళ్లిన వారిని గుర్తించేందుకు అన్ని కమిషనరేట్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాల పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్సును రంగంలోకి దింపారు. వైద్య, ఆరోగ్య, రెవెన్యూ అధికారులతో కలిసి ఈ పోలీస్ టాస్క్ఫోర్స్ పని చేస్తోంది. మత పెద్దల సహకారం తీసుకుంటున్నారు. వారిని తరలించిన ఏజెంట్లు, రైల్వే రిజర్వేషన్, ఇతర సాంకేతిక మార్గాల్లో వివరాలు సేకరిస్తున్నారు. నిజాముద్దీన్కు వెళ్లి వచ్చిన ఎక్కువ మంది పండ్లు, కూరగాయల వంటి చిరు వ్యాపారాలు చేసుకొనే వారే.
మళ్లీ వైద్య పరీక్షలు
కరీంనగర్లో ఇండోనేషియా మత ప్రచారకులకు సహకరించిన స్థానిక వ్యక్తికి కరోనా వ్యాధి సోకగా, తాజాగా ఆదివారం స్థానిక వ్యక్తి తల్లి, సోదరికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లా యంత్రాంగం ఆ వ్యక్తి ఇంటికి నలువైపులా అన్ని ఇళ్లల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు.
లారీలో వచ్చారు!
హరియాణాలో ఒక ఓ మత కార్యక్రమంలో పాల్గొని లారీలో తిరిగి వస్తున్న జగిత్యాల వాసులు 32 మందిని తెలంగాణ సరిహద్దులో పోలీసులు అడ్డుకుని హోం కార్వంటైన్కు తరలించారు. వారు లాక్డౌన్ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు.
గ్రేటర్లో పరిస్థితి ఎలా ఉందంటే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 603 మంది ఢిల్లీ వెళ్లివచ్చారు. వారు నగరం నలుమూలలా ఉన్నారు. వారు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు 200 బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం కుటుంబాల్ని హోం క్వారంటైన్ చేస్తున్నారు. వృద్ధులు, తీవ్రమైన రోగాలతో బాధ పడుతున్న వారు, ఇరుకు ఇళ్లలో ఉన్న వారందర్నీ ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు. మంగళవారం 463 ఇళ్లను తనిఖీ చేశారు. 74 మందికి కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని గాంధీ, ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. 348 మందిని హోం క్వారంటైన్ చేయగా, మరో 41 మందిని ప్రభుత్వ కేంద్రాలకు తరలించారు.