ఆలయాల నష్టం 100కోట్లు

ABN , First Publish Date - 2020-05-13T09:08:57+05:30 IST

రాష్ట్రంలో కేవలం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల సంపాదనకే కాక ఆలయాల ఆదాయానికీ కరోనా గండికొట్టింది. ఆలయ అర్చకులు నిత్య పూజలు నిర్వహిస్తున్నా...

ఆలయాల నష్టం 100కోట్లు

  • లాక్‌డౌన్‌తో కొన్ని ప్రముఖ ఆలయాలకు రూ. 50 కోట్లు గండి..
  • ప్రవేశం నిలిపివేతతో ఆదాయం శూన్యం
  • మరీ దారుణంగా చిన్న ఆలయాల పరిస్థితి
  • ఆలయ అర్చక, ఉద్యోగులకు 50శాతమే జీతం

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కేవలం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల సంపాదనకే కాక ఆలయాల ఆదాయానికీ కరోనా గండికొట్టింది. ఆలయ అర్చకులు నిత్య పూజలు నిర్వహిస్తున్నా... లాక్‌డౌన్‌ కారణంగా గడిచిన 50 రోజులుగా ఆలయాల్లోకి భక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు. దీంతో రాష్ట్రంలోని ఆలయాలకు రూ. 100కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని దేవాదాయశాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 31 వరకు వచ్చిన ఆదాయం ఆధారంగా ఈసారి నష్టపోయిన మొత్తాన్ని లెక్కగట్టింది. ఆ ప్రకారం చూస్తే.. మొత్తం రూ. 100 కోట్లకుపైగా నష్టం వాటిల్లగా.. అందులో యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, కొమురవెల్లి, బాసర, భద్రకాళి వంటి ప్రముఖ ఆలయాలకే సుమారు రూ.50కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు గుర్తించారు.


శ్రీరామనవమి ఉత్సవాల రద్దుతో భద్రాద్రి ఆలయ ఆదాయం భారీగా తగ్గింది. భద్రాద్రికి ప్రభుత్వం పెద్దగా నిధులు మంజూరు చేయపోవడంతో ఆర్జిత ేసవలు, భక్తుల కానుకలు, విరాళాలతోనే నిర్వహణ కొనసాగిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలోనూ రూ. 8 కోట్లకుపైగా నష్టం ఏర్పడింది. యాదాద్రిలోనూ సుమారు రూ. 10 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఆర్జిత సేవలు, హుండీ ఆదాయంతోపాటు ప్రసాద విక్రయాల వల్ల వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది. దీంతో ఆలయ అర్చక, ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాల్లో అధికారులు కోత విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,260 ఆలయాలు ఉన్నాయి. ఇందులో సగం వరకు ఏడాదికి రూ. లక్షలోపు ఆదాయం వచ్చేవే. వీటికి ప్రభుత్వమే ధూప దీప పథకం క్రింద ప్రతి నెల ఆరు వేల రూపాయలు చెల్లిస్తోంది. మిగిలిన ఆలయాల్లో ఆరువేల మంది అర్చక, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 2740 మందికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేతనం చెల్లిస్తున్నారు. వీరి వేతనాల్లో సగం ఆలయం నుంచి, మిగతా సగం ప్రభుత్వం నుంచి జమ అవుతుంది. పెద్ద ఆలయాల్లో అర్చక, ఉద్యోగుల మొత్తం వేతనం ఆలయమే భరిస్తుంది. అయితే.. ప్రస్తుతం ఆదాయం లేని కారణంగా వీరందరికి ప్రభుత్వం సగం జీతం మాత్రమే చెల్లిస్తోంది.


చిరు వ్యాపారులదీ అదే పరిస్థితి

ఆలయాల్లో భక్తుల ప్రవేశం నిలిపివేయడంతో ఆలయం వెలుపల పూజా సామగ్రి, పువ్వులు వంటి చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే చిరు వ్యాపారులు తీవ్ర నష్టాల్ని ఎదుర్కొంటున్నారు. ప్రసాద విక్రయాలు, పార్కింగ్‌, ఇతరత్రా పనులకు కాంట్రాక్టు తీసుకున్నవారిదీ అదే పరిస్థితి.


ప్రభుత్వం ఆదుకోవాలి

లాక్‌డౌన్‌ కారణంగా భక్తులు రాకపోవడంతో ఆలయాలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. కాళేశ్వర ఆలయం లాక్‌డౌన్‌ సమయంలో రూ. 40 లక్షల ఆదాయం కోల్పోయింది. తాజా నష్టాల కారణంగా భవిష్యత్తులో ఉత్సవాల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాలి. 

తెలంగాణ అర్చక సమాఖ్య

Updated Date - 2020-05-13T09:08:57+05:30 IST