వాయిదా పడిన టెస్ట్ల్లో సమంగా పాయింట్ల కేటాయింపు..!
ABN , First Publish Date - 2020-10-23T09:43:52+05:30 IST
నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్లో ప్రపంచ టెస్ట్ చాంపియన్షి్ప (డబ్ల్యూటీసీ) ఫైనల్ను నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది
డబ్ల్యూటీసీ షెడ్యూల్ ముగించాలనే ఆలోచనలో ఐసీసీ
దుబాయ్: నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్లో ప్రపంచ టెస్ట్ చాంపియన్షి్ప (డబ్ల్యూటీసీ) ఫైనల్ను నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చాంపియన్షి్ప షెడ్యూల్ పూర్తి చేయాలనుకుంటోంది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడిన ద్వైపాక్షిక సిరీస్ల విషయంలో పాయింట్లను సమంగా కేటాయించే విషయమై ఐసీసీ సమాలోచన చేస్తోందని సమాచారం. వచ్చే నెలలో జరిగే ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. పాయింట్లను సమానంగా పంచడం ఒక ఆలోచన కాగా.. వచ్చే ఏడాది మార్చి వరకు ఆయా జట్లు సాధించిన పాయింట్లను పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ప్రత్యర్థులను ఖరారు చేయాలనే మరో ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, సహేతుక కారణాల రీత్యా ఆడలేకపోయిన టెస్ట్లను డ్రాగా పరిగణించాల్సి ఉంటుంది. దీంతో వాయిదా పడిన టెస్ట్లకు ఇరు జట్లకు 1/3వ వంతు పాయింట్ల చొప్పున దక్కుతాయి.