16 ఏళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజున పాకిస్థాన్లో మోతెక్కించిన సెహ్వాగ్
ABN , First Publish Date - 2020-03-29T22:42:25+05:30 IST
వీరేంద్ర సెహ్వాగ్.. నవాబ్ ఆఫ్ నజఫ్గఢ్ క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియనవారుండరంటే అతిశయోక్తి కాదేమో. డ్యాషింగ్
న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్.. నవాబ్ ఆఫ్ నజఫ్గఢ్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియనవారుండరంటే అతిశయోక్తి కాదేమో. డ్యాషింగ్ బ్యాట్స్మన్గా పేరు గాంచిన వీరేంద్రుడు బ్యాట్ పట్టి మైదానంలోకి దిగితే బంతి బౌండరీలు దాటాల్సిందే. అతడి దెబ్బకు ఎన్నో రికార్డులు పాదాక్రాంతమయ్యాయి. అయితే, సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే 29 మార్చి 2004న సెహ్వాగ్ అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్గా రికార్డులకెక్కాడు. ముల్తాన్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. సెహ్వాగ్ 228 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు క్రీజులోకి వచ్చిన సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. 295 పరుగుల వద్ద సక్లైన్ ముస్తాక్ బౌలింగులో సిక్సర్ బాది ఈ ఫీట్ సాధించాడు. అంతేకాదు, పాకిస్థాన్లో పాకిస్థాన్పై అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగానూ సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 1989లో సంజయ్ మంజ్రేకర్ లాహోర్లో పాకిస్థాన్పై 218 పరుగులు చేశాడు. అప్పటి వరకు అదే రికార్డు కాగా, ఆ రికార్డును సెహ్వాగ్ బద్దలుగొట్టాడు.
309 పరుగుల వద్ద మహమ్మద్ సమీ బౌలింగ్లో సెహ్వాగ్ అవుటయ్యాడు. ఆ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ ఘటన జరిగిన తర్వాత సరిగ్గా నాలుగేళ్లకు అంటే 29 మార్చి 2008లో సెహ్వాగ్ మరో త్రిశతకం నమోదు చేశాడు. చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సెహ్వాగ్ రెండోసారి ‘ట్రిపుల్’ సాధించాడు. ఈ మ్యాచ్లో మూడో రోజు కెరీర్ బెస్ట్ 309 పరుగులను చేరుకున్న సెహ్వాగ్ నాలుగో రోజు 319 పరుగుల వద్ద అవుటయ్యాడు. భారత ఆటగాళ్లలో సెహ్వాగ్ తర్వాత కరుణ్ నాయర్ ఒక్కడే ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. 2016లో చెన్నైలో ఇంగ్లండ్పై నాయర్ త్రిశతకం నమోదు చేశాడు.