థామ్స-ఉబెర్ కప్ వచ్చే ఏడాదికి వాయిదా
ABN , First Publish Date - 2020-09-16T09:32:07+05:30 IST
ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ థామస్-ఉబెర్ ఫైనల్స్ కప్ వాయిదా పడింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో...

వరల్డ్ టూర్ ఈవెంట్ యథాతధం
బీడబ్ల్యూఎఫ్ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ థామస్-ఉబెర్ ఫైనల్స్ కప్ వాయిదా పడింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అగ్రశ్రేణి జట్లన్నీ ఒక్కొక్కటిగా టోర్నీకి దూరమవుతుండడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వాయిదా నిర్ణయం తీసుకోక తప్పలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ వచ్చేనెల 3 నుంచి 11వ వరకు డెన్మార్క్లోని అర్హస్ నగరంలో జరగాలి. ఈ టోర్నీ కోసం సింధు, సైనా, కిడాంబి శ్రీకాంత్లాంటి స్టార్లతో కూడిన పురుషులు, మహిళల జట్లను భారత్ ఇప్పటికే ప్రకటించింది. కానీ.. ఫేవరెట్ ఇండోనేసియా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, చైనీస్ తైపీలాంటి టాప్జట్లతో పాటు ఆస్ట్రేలియా, అల్జీరియా కొవిడ్ మహమ్మారి విజృంభణ దృష్ట్యా తాము టోర్నీలో ఆడలేమని ప్రకటించాయి. ఇలా.. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో టోర్నీని వాయిదా వేస్తున్నట్టు బీడబ్ల్యూఎఫ్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అయితే వచ్చేనెల 13 నుంచి 18 వరకు డెన్మార్క్లోని ఓడెన్స్లో జరిగే వరల్డ్ టూర్ ఈవెంట్ డెన్మార్క్ ఓపెన్ షెడ్యూల్లో మాత్రం ఎలాంటి మార్పుండదనీ.. ఆ టోర్నీ యథాతధంగా జరుగుతుందని పేర్కొంది.