ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ABN , First Publish Date - 2020-03-16T10:34:10+05:30 IST
భారత వెటరన్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ అదరగొట్టాడు. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న అంతర్జాతీయ టైటిల్ను ఎట్టకేలకు ఒడిసి పట్టుకున్నాడు.
పదేళ్ల తర్వాత తొలి టైటిల్ నెగ్గిన శరత్
ఒమన్ టీటీలో విజేతగా నిలిచిన కమల్
మస్కట్: భారత వెటరన్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ అదరగొట్టాడు. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న అంతర్జాతీయ టైటిల్ను ఎట్టకేలకు ఒడిసి పట్టుకున్నాడు. ఐటీటీఎఫ్ చాలెంజర్ ప్లస్ ఒమన్ ఓపెన్లో చాంపియన్గా నిలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగోసీడ్ శరత్ 6-11, 11-8, 12-10, 11-9, 3-11, 17-15తో పోర్చుగల్కు చెందిన టాప్సీడ్ మార్కస్ ఫ్రెటిస్ను చిత్తుచేసి ట్రోఫీ అందుకున్నాడు. 37 ఏళ్ల శరత్ చివరిసారిగా 2010లో ఈజిప్టు ఓపెన్లో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2011లో మొరాకో, 2017లో ఇండియా ఓపెన్లో సెమీస్ దాకా రాగలిగాడు.