భేషరతు క్షమాపణ చెప్పిన సస్పెండైన సీఎస్కే వైద్యుడు
ABN , First Publish Date - 2020-06-19T01:07:16+05:30 IST
చైనా బలగాల దాడిలో సైనికులు అమరులు కావడంపై ప్రభుత్వాన్ని నిందిస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు

చెన్నై: చైనా బలగాల దాడిలో సైనికులు అమరులు కావడంపై ప్రభుత్వాన్ని నిందిస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వైద్యుడు మధు తొట్టప్పిలిల్ గురువారం భేషరతు క్షమాపణ తెలిపారు. సైనికుల మృతి తర్వాత ప్రభుత్వాన్ని అపహాస్యం చేస్తూ మధు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో గురువారం మధు క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు.
‘‘జూన్ 16న నేను చేసిన ట్వీట్లోని పదాలు సరైనవి కాదు. అనాలోచితమైనవని తెలుసుకున్న తర్వాత డిలీట్ చేశాను. అయితే, అప్పటికే నా ట్వీట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాకెక్కి షేర్ అయ్యాయి’’ అని డాక్టర్ మధు తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రధానిని అవమానించాలన్న ఉద్దేశం తనకు లేదని మధు స్పష్టం చేశారు.