‘ఐసీసీ’ రేసులో బీసీసీఐ!
ABN , First Publish Date - 2020-05-18T09:26:51+05:30 IST
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యున్నత పదవికి భారత్ మరోసారి పోటీపడాలనే ఆలోచనలో ఉంది. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన శశాంక్ ...

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యున్నత పదవికి భారత్ మరోసారి పోటీపడాలనే ఆలోచనలో ఉంది. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన శశాంక్ మనోహర్ ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చేనెలతో అతడి పదవీకాలం పూర్తి కానుంది. నిబంధనల ప్రకారం చైర్మన్ కావాలనుకునే వ్యక్తి స్వతంత్రంగా ఉండాలి. వారి దేశ క్రికెట్ బోర్డుల్లో ఎలాంటి పదవిలో ఉండకూడదు. ‘కచ్చితంగా మేం రేసులో ఉంటాం. ఎన్నికల ప్రక్రియ కొలిక్కి వచ్చాక ఈ విషయమై ఆలోచిస్తాం. మా దగ్గర సరైన అభ్యర్థులున్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి పేర్కొన్నారు. శరద్ పవార్, శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్, అమితాబ్ చౌధురిలకు పోటీ చేసే అర్హత ఉంది.
జన్ధన్ ఖాతాల వల్లే ప్రైజ్మనీ ఆలస్యం..
జూనియర్ క్రికెటర్లకు ఇవ్వాల్సిన ప్రైజ్మనీ ఆలస్యంపై బీసీసీఐ స్పందించింది. చాలామంది ఆటగాళ్లకు జన్ధన్ ఖాతాలున్నాయని, దాంట్లో గరిష్ఠంగా రూ.50 వేల మొత్తానికి మాత్రమే వీలుంటుందని పేర్కొంది. దీంతో బ్యాంక్ అధికారులతో మాట్లాడి వాటిని సేవింగ్స్ ఖాతాల కింద మార్పించి నగదు వేస్తామని బోర్డు తెలిపింది. బీసీసీఐ వార్షిక అవార్డులు పొందిన తమకు రూ.1.5 లక్షల చొప్పున రివార్డును ఇదివరకే ప్రకటించారనీ, కానీ ఇప్పటిదాకా తమ ఖాతాలో నగదు వేయలేదని క్రికెటర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.