క్రికెట్‌కు వాట్సన్‌ వీడ్కోలు!

ABN , First Publish Date - 2020-11-03T09:21:22+05:30 IST

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ 13 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖరి మ్యాచ్‌ను

క్రికెట్‌కు వాట్సన్‌ వీడ్కోలు!

దుబాయ్‌: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ 13 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖరి మ్యాచ్‌ను ఆడేసిన తర్వాత.. అన్ని రకాల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్టు వాట్సన్‌ జట్టు సహచరులకు, ఫ్రాంచైజీకి  చెప్పినట్టు సమాచారం. తన నిర్ణయం వెల్లడించే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడని, చెన్నైకి ఆడడం గౌరవంగా భావిస్తున్నట్టు వాట్సన్‌ చెప్పాడని జట్టు అధికారి పేర్కొన్నాడు. నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 39 ఏళ్ల వాట్సన్‌ అప్పటి నుంచి వివిధ టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నాడు. అయితే గతేడాది బిగ్‌బాష్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అతను తాజాగా ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. 2018లో సీఎస్‌కే వాట్సన్‌ను కొనుగోలు చేసింది. సీఎస్‌కే తరఫున అతను 43 మ్యాచ్‌లు ఆడాడు. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌ ఫైనల్లో వాట్సన్‌ సెంచరీతోనే జట్టు మూడో టైటిల్‌ సాధించింది. గతేడాది కూడా ఫైనల్లో అర్ధసెంచరీ చేసినా ఒక పరుగు తేడాతో చెన్నై ఓటమిపాలైంది. సీఎ్‌సకేకు ముందు రాజస్థాన్‌, బెంగళూరు జట్ల తరఫున వాట్సన్‌ ఆడాడు. ఓవరాల్‌గా 2008 నుంచి ఇప్పటిదాకా వాట్సన్‌ 145 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 3,874 పరుగులు చేయగా, ఇందులో 4 శతకాలున్నాయి. 92 వికెట్లు తీశాడు. మరోవైపు ధోనీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వచ్చే సీజన్‌ నుంచి చెన్నై సహాయక బృందంలో ఉండే అవకాశం లేకపోలేదు.

Updated Date - 2020-11-03T09:21:22+05:30 IST