‘ధోనీ రిటైర్స్’ హాష్ట్యాగ్.. మరోసారి నెటిజన్లపై మండిపడ్డ సాక్షి
ABN , First Publish Date - 2020-05-28T17:36:48+05:30 IST
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2019 తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. మెగా టోర్నమెంట్
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2019 తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. మెగా టోర్నమెంట్ తర్వాత క్రికెట్ నుంచి ధోనీ విరామం తీసుకున్నాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అయినా.. ధోనీ ఆడుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లీగ్ వాయిదా పడటంతో వారికి నిరాశే మిగిలింది. దీంతో ధోనీ రిటైర్మెంట్ మరోసారి తెరమీదకు వచ్చింది. తాజాగా ‘ధోనీ రిటైర్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ఒకటి సోషల్మీడియాలో వైరల్ అయింది. ధోనీ త్వరలోనే రిటైర్ అవుతున్నాడనే పుకార్లను పలువురు ట్వీట్ చేశారు. అయితే వీరిపై ధోనీ సతీమణి సాక్షి మండిపడింది.
‘‘ఇవన్నీ పుకార్లే. లాక్డౌన్ కారణంగా కొందరి మానసిక స్థితి దెబ్బతిన్నది అని నాకు అర్ధమవుతుంది. దయచేసి బుద్ది తెచ్చుకోండి’’ అంటూ సాక్షి ట్వీట్ చేసింది. అయితే కొంత సమయం తర్వాత సాక్షి ఆ ట్వీట్ని డిలీట్ చేసింది. గతంలో కూడా ధోనీ రిటైర్ అవుతున్నాడనే వార్త సోషల్మీడియాలో చెక్కర్లు కొట్టింది. అప్పుడు కూడా సాక్షి ఈ విధంగానే స్పందించింది. ‘అది పుకారు మాత్రమే’ అంటూ సాక్షి సింపుల్ ట్విట్తో పుకార్లకు చెక్ పెట్టిన విషయం తెలిసిందే.