కోహ్లీ లోటు పూడ్చలేనిదే..
ABN , First Publish Date - 2020-12-10T09:01:29+05:30 IST
ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టులకు కెప్టెన్ కోహ్లీలేని లోటు పూడ్చలేనిదని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు...

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టులకు కెప్టెన్ కోహ్లీలేని లోటు పూడ్చలేనిదని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే విరాట్ లేకపోవడం యువ ఆటగాళ్లకు సువర్ణావకాశంగా అభివర్ణించాడు. ఆసీస్ తో 4 టెస్టుల్లో భారత్ తలపడనుంది. తొలి టెస్ట్ (డే/నైట్) ఈనెల 17 నుంచి అడిలైడ్లో జరగనుంది. కాగా మొ దటి బిడ్డకు జన్మనివ్వనున్న భార్య అనుష్క చెంత ఉండేందుకు తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్ రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ మాట్లాడుతూ.. ‘అనుభజ్ఞుడైన విరాట్ లేకపోవడం నిస్సందేహంగా పూడ్చలేని లోటు. కానీ ఇక్కడ వ్యక్తుల గురించి కాదని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం భారత రిజర్వ్ బెంచ్ బలంగా ఉండడం దేశ క్రికెట్కు శుభ పరిణామం’ అని పేర్కొన్నాడు.
రోహిత్ వెళ్లాల్సిందే..
ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లాల్సిందేనని సచిన్ అన్నాడు. ‘రోహిత్ ఫిటెనెస్ గురించి నాకు తెలీదు. బీసీసీఐ, జట్టు ఫిజియో, యాజమాన్యానికి తెలిసే ఉంటుంది. రోహిత్ కనుక ఫిట్నెస్ టెస్ట్ పాసైతే అతడు ఆస్ట్రేలియాలో ఉండాల్సిందే’ అని అభిప్రాయపడ్డాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ గాయంతో దూరం కావడంతో.. అతడి స్థానంలో నటరాజన్ను జట్టులోకి తీసుకునే అంశంపై సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సచిన్ అన్నాడు.