ఐపీఎల్లో ఓపెనర్గా బరిలోకి రోహిత్ శర్మ
ABN , First Publish Date - 2020-09-18T21:50:29+05:30 IST
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్శర్మ ఈ సీజన్లో ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నాడు. కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి ఆన్లైన్
దుబాయ్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్శర్మ ఈ సీజన్లో ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నాడు. కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి ఆన్లైన్ మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అందివచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటామని పేర్కొన్న రోహిత్.. బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం ఓపెనర్గా బరిలోకి దిగనున్నట్టు చెప్పాడు.
‘‘గత సీజన్లో టోర్నమెంట్ మొత్తం బ్యాటింగ్ ప్రారంభించాను. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తాను. ఓ జట్టుగా అన్ని అవకాశాలను తెరిచే ఉంచుకుంటాం. జట్టు ఏం కోరుకుంటే అది సంతోషంగా చేస్తాను. టాపార్డర్లో బ్యాటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా’’ అని పేర్కొన్నాడు.
జయవర్ధనే మాట్లాడుతూ.. జట్టుకు లిన్ గొప్ప బలమని పేర్కొన్నాడు. అయితే, రోహిత్, క్వింటన్ డికాక్ భాగస్వామ్యం గత సీజన్లో అద్భుతంగా పనిచేసినట్టు చెప్పాడు. వారు మంచి ఆటగాళ్లే కాక, అనుభవం ఉన్నవాళ్లని పేర్కొన్నాడు. ఇప్పుడు కూడా దానినే కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. లిన్ ఎక్కడైనా ఒదిగిపోతాడని పేర్కొన్నాడు.
వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ ముంబై మ్యాచ్ విన్నరని, అతడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమైన పనేనని రోహిత్ చెప్పుకొచ్చాడు. నాథన్ కల్టర్ నైల్, జేమ్స్ పాటిన్సన్, ధవల్ కుల్కర్ణి వంటి వారితో భర్తీ చేయాలని యోచిస్తున్నట్టు చెప్పాడు. జట్టు సమస్యల్లో ఉన్నప్పుడు మలింగ బయటపడేసేవాడని కితాబిచ్చాడు. అతడి అనుభవాన్ని జట్టు మిస్సవుతున్నట్టు రోహిత్ చెప్పుకొచ్చాడు.