నా నగరాన్ని ఇలా చూస్తానని అనుకోలేదు: గంగూలీ
ABN , First Publish Date - 2020-03-24T23:55:19+05:30 IST
శరవేగంగా విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న కోవిడ్-19కు

కోల్కతా: శరవేగంగా విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న కోవిడ్-19కు అడ్డుకట్ట వేసేందుకు దేశమంతా దాదాపు లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. కోల్కతా కూడా మూతపడింది. దీంతో జనమంతా ఇంటిపట్టునే ఉండడంతో నిత్యం రద్దీగా ఉండే కోల్కతా రోడ్లన్నీ బోసిపోయాయి. కళకళలాడే పురాతన హౌరా బ్రిడ్జి సైతం వెలవెలబోయింది. ఈ పరిస్థితిపై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు.
బోసిపోయిన నగర రోడ్లను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన దాదా.. తన నగరాన్ని ఇలా చూస్తానని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించిన గంగూలీ త్వరలోనే పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, దేశంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 500 కేసులు నమోదు కాగా, ఈ మహమ్మారి బారినపడి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 16 వేలమంది ఈ మహమ్మారికి బలయ్యారు.