ఐసీసీ ఈ దశాబ్దపు మహిళా జట్లలో మిథాలీ సహా నలుగురు భారతీయులు

ABN , First Publish Date - 2020-12-28T03:18:16+05:30 IST

ఐసీసీ ఈ రోజు ప్రకటించిన ఈ దశాబ్దపు మహిళల టీ20, వన్డే జట్లలో భారత్‌కు చెందిన ఇద్దరు సీనియర్ క్రికెటర్లు మిథాలీరాజ్

ఐసీసీ ఈ దశాబ్దపు మహిళా జట్లలో మిథాలీ సహా నలుగురు భారతీయులు

దుబాయ్: ఐసీసీ ఈ రోజు ప్రకటించిన ఈ దశాబ్దపు మహిళల టీ20, వన్డే జట్లలో భారత్‌కు చెందిన ఇద్దరు సీనియర్ క్రికెటర్లు మిథాలీరాజ్, ఝులన్ గోస్వామిలతోపాటు యువ ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్‌లకు చోటు లభించింది. మహిళ ఈ దశాబ్దపు వన్డే జట్టులో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. కెప్టెన్ మెగ్ లానింగ్, ఓపెనింగ్ బ్యాటర్ అలీసా హీలీ, ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీలకు చోటు దక్కగా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నుంచి ఇద్దరేసి క్రికెటర్లకు చోటు లభించింది. అలాగే, ఇంగ్లండ్‌కు చెందిన సారా టేలర్, న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేటెస్‌లకు కూడా చోటు దక్కింది. 


మహిళల దశాబ్దపు టీ20 జట్టులోనూ ఆస్ట్రేలియన్ల ఆధిపత్యం కనిపించింది. ఆ దేశానికి చెందిన నలుగురిని టీ20 జట్టుకి ఎంపిక చేయగా, ఆ తర్వాత ఇండియా, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుంచి చెరో ఇద్దరికి చొప్పున చోటు దక్కింది. ఇంగ్లండ్‌ నుంచి అన్యా శ్రుభ్‌సోల్‌ మాత్రమే ఎంపికైంది. 


ఆస్ట్రేలియాకు చెందిన అలీసా హీలీ, మెగ్ లానింగ్, ఎల్లిస్ పెర్రీ, న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేటెస్, వెస్టిండీస్‌కు చెందిన స్టఫానీ టేలర్‌లకు వన్డే, టీ20 జట్లు రెండింటిలోనూ చోటు లభించగా, భారత్‌కు చెందిన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకు వన్డే జట్టులో చోటు లభించగా, ఇండియా టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌లకు టీ20 జట్టులో చోటు దక్కింది. 

Updated Date - 2020-12-28T03:18:16+05:30 IST