మంజ్రేకర్పై వేటు
ABN , First Publish Date - 2020-03-15T10:34:17+05:30 IST
మంజ్రేకర్పై వేటు
![మంజ్రేకర్పై వేటు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020031504492719/03152020050411n59.jpg)
- వ్యాఖ్యాతల ప్యానెల్ నుంచి తొలగింపు
న్యూఢిల్లీ: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేకు వ్యాఖ్యాతల్లో సంజయ్ మంజ్రేకర్ లేకపోవడం పలు అనుమానాలు రేకెత్తించింది. అయితే అతడిని ఆ ప్యానెల్ నుంచి బీసీసీఐ తప్పించినట్టు..బోర్డు వర్గాలు వెల్లడించాయి. మంజ్రేకర్పై వేటుకు కారణాలు కచ్చితంగా తెలియకున్నా.. అతడి శైలిపై బీసీసీఐ సంతృప్తిగా లేదని సమాచారం. 54 ఏళ్ల మంజ్రేకర్ తన వ్యాఖ్యలతో పలుసార్లు వివాదాస్పదుడయ్యాడు. గత ఏడాది వన్డే వరల్డ్కప్ సందర్భంగా ఆల్రౌండర్ జడేజాను ‘అప్పుడప్పుడు జట్టులోకి వచ్చిపోయే ఆటగాడి’గా వర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ వ్యాఖ్యలకు జడేజా కూడా ఘాటుగా సమాధానమిచ్చాడు. దాంతో జడేజా గురించి తాను తప్పుగా అంచనా వేశానని ఆ తర్వాత మంజ్రేకర్ అంగీకరించాడు. ఇకపోతే.. అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడని హర్షా భోగ్లే వ్యాఖ్యానానికి విశ్వసనీయత ఏపాటిదని.. బంగ్లాదేశ్తో గులాబీ టెస్ట్ సందర్భంగా కామెంట్రీ బాక్స్ నుంచి మంజ్రేకర్ అనడం తీవ్ర వివాదం రేపింది.