క్రికెట్ కాదు చదువు ముఖ్యం
ABN , First Publish Date - 2020-04-26T10:14:07+05:30 IST
కరోనా వైర్సపై పోరుకు నిధుల సమీకరణ కోసం భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ..

అఫ్రీది వ్యాఖ్యలకు కపిల్ కౌంటర్
న్యూఢిల్లీ: కరోనా వైర్సపై పోరుకు నిధుల సమీకరణ కోసం భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు. కానీ, భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు. ఆ ప్రతిపాదనను కపిల్ తిరస్కరించడాన్ని పాకిస్థాన్కు చెందిన మరో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తప్పుపట్టాడు. అయితే, అఫ్రీది విమర్శలకు కపిల్ తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చాడు. ‘మీరు భావోద్వేగంలో ఉంటే భారత్-పాక్ మ్యాచ్లు ఆడాలంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు జట్లు తలపడడం ముఖ్యం కాదు. మీకు డబ్బులు కావాలంటే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలను తక్షణం ఆపేయండి. వాటిపై పెట్టే ఖర్చును ఆస్పత్రులు, పాఠశాలల నిర్మాణాలకు వెచ్చించవచ్చు. లాక్డౌన్ కారణంగా పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక పోవడం ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల లాక్డౌన్ పూర్తయ్యాక తొలుత వాటిని తెరవాలి. ఆ తర్వాతే క్రికెట్ గురించి ఆలోచిద్దాం’ అని కపిల్ అన్నాడు.
కరోనా పూర్తిగా తగ్గాకే: యువరాజ్
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం పూర్తిగా విముక్తి పొందాకే క్రికెట్ కార్యకలాపాలను పునరుద్ధరించాలని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. ‘కరోనా పూర్తిగా తగ్గాకే క్రికెట్ పోటీలను తిరిగి ప్రారంభించాలి. లేకుంటే ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టడానికే భయపడతారు’ అని యువీ చెప్పాడు.