భారత హాకీ మహిళా జట్టుకు ‘కరోనా’ ఎఫెక్ట్: చైనా టూర్ రద్దు
ABN , First Publish Date - 2020-02-08T03:22:22+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు భారత హాకీ మహిళా జట్టుపై పడింది. ఒలింపిక్స్కు ముందు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు భారత హాకీ మహిళా జట్టుపై పడింది. ఒలింపిక్స్కు ముందు సాధనలో భాగంగా భారత మహిళా జట్టు మార్చి 14 నుంచి 25 వరకు చైనాలో పర్యటించాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పర్యటనను రద్దు చేసినట్టు మహిళా జట్టు కెప్టెన్ రాణి తెలిపింది. ప్రొ-హాకీ లీగ్లో చాలా జట్లు బిజీగా ఉండడంతో తమతో ఆడేందుకు ఎవరూ అందుబాటులో లేరని పేర్కొంది. ఎవరితో ఆడాలన్న విషయమై హాకీ ఇండియా, కోచ్లు చర్చిస్తున్నట్టు వివరించింది.
అగ్రశ్రేణి జట్లు అయిన అర్జెంటినా, బెల్జియం, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా, గ్రేట్ బ్రిటన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి జట్లు ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో తలపడుతున్నాయి. ఒలిపింక్స్కు ఐదు నెలల సమయం కూడా లేదని, దానికి సిద్ధం కావాలంటే ఇప్పటి నుంచే కఠోర శిక్షణ అవసరమని రాణి పేర్కొంది. గతేడాది భువనేశ్వర్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో యూఎస్ఏను ఓడించిన భారత జట్టు ఒలింపిక్ బెర్త్ను ఖరారు చేసుకుంది.