బాదేసిన కంగారూలు.. భారత్ టార్గెట్ ఎంతంటే..
ABN , First Publish Date - 2020-11-27T19:17:57+05:30 IST
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్లో..

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్లో తొలి వన్డే ప్రారంభమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్కు సహకరిస్తుండటంతో కంగారూ ఆటగాళ్లు చెలరేగిపోయారు. కెప్టెన్ ఆరోన్ ఫించ్(124 బంతుల్లో 114), స్మిత్ అద్భుత శతకాలు నమోదు చేశారు. స్మిత్ ధాటిగా ఆడి 66బంతుల్లోనే 105పరుగులు చేశాడు. వార్నర్(76 బంతుల్లో 69), మాక్స్వెల్(19 బంతుల్లో 45) కూడా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు 6వికెట్లు కోల్పోయి 374 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అంటే భారత్ లక్ష్యం 375 పరుగులన్నమాట. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, సైనీ, చాహాల్ ఒక్కో వికెట్ తీశారు.
నల్లరిబ్బన్లు ధరించిన ఆటగాళ్లు..
మ్యాచ్ సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లందరూ నల్ల ఆర్మ్బ్యాండ్తో గ్రౌండ్లోకి దిగారు. ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మెన్ డీన్ జోన్స్కు, అలాగే ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మరణించిన ఫిలిప్ హ్యూస్కు నివాళులర్పించడం కోసమే ఆటగాళ్లంతా ఈ ఆర్మ్బ్యాండ్ ధరించారు. మ్యాచ్ ఆడుతుండగా వేగంగా వచ్చిన బంతి తలకు తగలడంతో హ్యూస్ మరణించిన విషయం తెలిసిందే.