చేయి కూడా కదపలేకపోతున్నాడు.. షమీ గాయంపై కోహ్లీ

ABN , First Publish Date - 2020-12-19T22:44:23+05:30 IST

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన తొలి టెస్టు మూడో రోజు బ్యాటింగ్‌లో తీవ్రంగా గాయపడిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ రెండో టెస్టులో

చేయి కూడా కదపలేకపోతున్నాడు.. షమీ గాయంపై కోహ్లీ

అడిలైడ్: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన తొలి టెస్టు మూడో రోజు బ్యాటింగ్‌లో తీవ్రంగా గాయపడిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ రెండో టెస్టులో ఆడడం అనుమానంగానే ఉంది. ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బౌన్సర్‌ను ఆడే క్రమంలో షమీ కుడి చేయి మణికట్టు, మోచేయికి గాయమైంది. బాధను భరించలేని షమీ రిటైర్డ్ అవుట్‌గా మైదానాన్ని వీడాడు. దీంతో భారత జట్టు రెండో ఇన్సింగ్స్ 36/9 వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా విజయానికి 90 పరుగులు అవసరం కాగా, రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేజించింది. షమీ కుడిచేతికి తీవ్ర గాయమైందని, స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు కోహ్లీ తెలిపాడు. 


‘‘షమీ గురించి కొత్త వార్తలేమీ లేవు. స్కానింగ్ చేయంచుకోడానికి వెళ్లాడు. నొప్పి తీవ్రంగా ఉంది. చేతిని కదిలించలేకపోతున్నాడు. ఏం జరిగిందనేది సాయంత్రానికల్లా తెలుస్తుంది’’ అని మ్యాచ్ అనంతరం కోహ్లీ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టు నాటికి షమీ కోలుకోకుంటే భారత జట్టుకు అది ఎదురుదెబ్బే అవుతుంది. పేసర్ ఇషాంత్ శర్మ గాయంతో ఇప్పటికే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు షమీ కూడా లేకుంటే పేస్ బౌలింగ్‌లో భారత్‌కు తిప్పలు తప్పవు.   

Updated Date - 2020-12-19T22:44:23+05:30 IST