కోహ్లీ లేకుంటే భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో శూన్యత తప్పదు: ఇయాన్ చాపెల్

ABN , First Publish Date - 2020-11-22T23:03:06+05:30 IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ లేకుంటే భారతజట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్ద శూన్యత ఏర్పడుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్

కోహ్లీ లేకుంటే భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో శూన్యత తప్పదు: ఇయాన్ చాపెల్

న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ లేకుంటే భారతజట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్ద శూన్యత ఏర్పడుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే, టీ20, నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. టీమిండియా సారథి కోహ్లీ మాత్రం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడి ఇండియాకు రానున్నాడు. అతడి భార్య అనుష్క తొలి బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో బీసీసీఐ కోహ్లీకి పితృత్వ సెలువు మంజూరు చేసింది. 

 

కోహ్లీ కనుక ఇండియాకు వెళ్తే భారత జట్టు సెలక్షన్ డైలమాలో పడుతుందని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. కోహ్లీ లేకుంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్ద శూన్యత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డాడు. అయితే, అదే సమయంలో ప్రతిభ గల మరో ఆటగాడికి చోటు దక్కుతుందన్నాడు. మరోవైపు, ఆస్ట్రేలియా కూడా ఓపెనర్ల విషయంలో డైలమా ఎదుర్కొంటోందని అన్నాడు. డేవిడ్ వార్నర్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించేదెవర్న విషయంలో స్పష్టత లేదన్నాడు. 


జో బర్న్స్ రెండో ఓపెనర్‌గా ఉండగా, విల్ పుకోవ్‌స్కీ ఎలా ఆడగలడన్న విషయాన్ని ఇయాన్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ పుకోవ్‌స్కీ షీల్డ్ స్థాయిలో ఆరు సెంచరీలు సాధించాడని, అందులో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆ మూడింటిలో రెండు డబుల్ సెంచరీలు ఈ సీజన్‌లోనే చేశాడని, తనలో కావాల్సినంత ప్రతిభ ఉందని నిరూపించాడని అన్నాడు. ఇప్పుడతడు టెస్టుల్లోనూ విజయం సాధించగలడా? అని వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైందని చాపెల్ వివరించాడు.

Updated Date - 2020-11-22T23:03:06+05:30 IST