నేను చనిపోలేదు.. మరణ వార్తపై స్పందించిన పాక్ పేసర్ ఇర్ఫాన్
ABN , First Publish Date - 2020-06-22T19:51:54+05:30 IST
ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన ఓ ప్రకటన ఆ జట్టు పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్కు పెద్ద తలనొప్పిగా...

ఇస్లామాబాద్: ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన ఓ ప్రకటన ఆ జట్టు పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్కు పెద్ద తలనొప్పిగా మారింది. ‘ఇర్ఫాన్ అనే క్రికెటర్ చనిపోయాడని, అతడి మృతికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఆ ప్రకటనలో పీసీబీ పేర్కొంది. దీంతో పాకిస్తాన్ స్టార్ పేసర్ ఇర్ఫాన్ చనిపోయాడనే పుకార్లు దేశ వ్యప్తంగా షికార్లు చేశారు. అభిమానులైతే అతడి మృతికి సంతాపాలు తెలపడం ప్రారంభించేశారు. ఇదంతా చూసిన ఇర్ఫాన్కు మతి పోయినంత పనైంది. దాంతో తాను చనిపోలేదని, తనకెటువంటి యాక్సిడెంట్ జరగలేదని, అవన్నీ వట్టి పుకార్లేనని ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
ఈ పుకార్ల వల్ల దీనికి సంబంధించి విరామం లేకుండా కాల్స్ వస్తున్నాయని, దీనివల్ల తాను, తన కుటుంబం ఎంతో కలత చెందామని, దయచేసి ఇటువంటి వాటిని వ్యాప్తి చేయవద్దని ఇర్ఫాన్ వేడుకున్నాడు. ఇదిలా ఉంటే పీసీబీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఇర్ఫాన్ అనే క్రికెటర్ మృతిపై సంతాపం తెలపడం వాస్తవం. అయితే అతడు జాతీయ బధిరుల క్రికెట్ జట్టు సభ్యుడు. అతడి పేరు కూడా మహ్మద్ ఇర్ఫాన్ కావడంతో ఈ గందరగోళం చోటుచేసుకుంది.