రైతుల ఆందోళనకు 30 మంది క్రీడాకారుల మద్ధతు
ABN , First Publish Date - 2020-12-07T10:48:17+05:30 IST
వ్యవసాయ చట్టాలపై ప్రముఖ బాక్సర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత విజేందర్ సింగ్ కేంద్రప్రభుత్వానికి సంచలన హెచ్చరిక చేశారు....

న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు 30 మంది క్రీడాకారులు మద్ధతు ప్రకటించనున్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రముఖ బాక్సర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత విజేందర్ సింగ్ కేంద్రప్రభుత్వానికి సంచలన హెచ్చరిక చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలో విజేందర్ సింగ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకోకపోతే తనకు వచ్చిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును తిరిగి కేంద్రానికి ఇస్తానని రైతుల సభలో విజేందర్ ప్రకటించారు.
‘‘నేను పంజాబ్ రాష్ట్రంలో క్రీడా శిక్షణ పొందాను...అన్నం పెడుతున్న అన్నదాతలు చలిలోనూ ఆందోళన చేస్తున్నపుడు వారి సోదరుడిగా వచ్చి మద్ధతు ప్రకటించాను, హర్యానాలో క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నందు వల్ల వారు రైతులకు మద్ధతు ఇస్తున్నా ఆందోళనల్లో పాల్గొనలేక పోతున్నారు’’ అని విజేందర్ చెప్పారు. 30 మంది మాజీ ఒలింపిక్ పతక విజేతలు రైతుల ఆందోళనకు మద్ధతు ఇస్తారని భారత బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారుడు సజ్జన్ సింగ్ చెప్పారు. ప్రముఖ నవలా రచయిత డాక్టర్ జస్విందర్ సింగ్ తనకు కేంద్రం ఇచ్చిన భారతీయ సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చి రైతుల ఆందోళనకు మద్ధతు ప్రకటించారు.