ధోనీ మళ్లీ ఆడతాడనే నమ్మకం నాకు లేదు: నెహ్రా
ABN , First Publish Date - 2020-04-27T01:09:57+05:30 IST
గత ఏడాది ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్కి దూరంగా ఉంటున్న విషయం

న్యూఢిల్లీ: గత ఏడాది ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరకపోవడంతో బీసీసీఐ అతని కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అయితే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధోనీ.. ఈ టోర్నమెంట్లో చేసే ప్రదర్శన ఆధారంగా మళ్లీ అతన్ని జట్టులోకి తీసుకుంటామని బోర్డు, కోచ్ తదితరులు వెల్లడించారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో.. ఐపీఎల్ కాస్త రద్దైంది. దీంతో ధోనీని మళ్లీ మైదానంలో చూస్తామని ఆశపడ్డా అభిమానులకు నిరాశే ఎదురైంది.
అయితే ఐపీఎల్ జరగని నేపథ్యంలో ధోనీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని పలువురు సీనియర్లు అంటున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ బౌలర్ ఆశీశ్ నెహ్రా కూడా ఇదే మాట అన్నారు. ధోనీ మళ్లీ క్రికెట్ ఆడుతాడనే నమ్మకం తనకు లేదని నెహ్రా అభిప్రాయపడ్డారు. ‘‘ఎంఎస్ ధోనీ ఫిట్గా ఉండి.. ఆడే అవకాశం ఉంటే.. వికెట్ కీపింగ్కి అతనే నా నెం.1 ఛాయిస్. అయితే నాకు తెలిసి ధోనీ ఇక క్రికెట్ ఆడకపోవచ్చు. అతను ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తాడో మనం ఊహించలేము. అతను ఇప్పటివరకూ రిటైర్మెంట్ ప్రకటించలేదన్న విషయం నిజమే. కానీ, అతను పరిస్థితుల్ని ఏ క్షణంలో ఎలా మారుస్తాడో మనకు తెలియదు’’ అని నెహ్రా అన్నారు.