కోహ్లీకి శాస్త్రి చెప్పుండాల్సింది
ABN , First Publish Date - 2020-12-03T09:44:42+05:30 IST
ఇటీవల రోహిత్ శర్మ గాయం అంశం ఎంత వివాదానికి దారి తీసిందో గుర్తుందిగా! రోహిత్కు గాయంపై తనకు సమాచారమే లేదని కెప్టెన్ కోహ్లీ ఆ మధ్య మీడియా సమావేశంలో అసహనం వ్యక్తం చేశాడు.

రోహిత్ గాయం వివాదంపై గంభీర్
న్యూఢిల్లీ: ఇటీవల రోహిత్ శర్మ గాయం అంశం ఎంత వివాదానికి దారి తీసిందో గుర్తుందిగా! రోహిత్కు గాయంపై తనకు సమాచారమే లేదని కెప్టెన్ కోహ్లీ ఆ మధ్య మీడియా సమావేశంలో అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లీకి జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి సమాచారమిచ్చి ఉండాల్సిందని అన్నాడు. ‘రోహిత్ గాయం విషయమై స్పష్టత కొరవడిందంటూ విరాట్ కోహ్లీ మీడియా ముందు వ్యాఖ్యానించాడంటే సమాచారలోపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఉదంతంలో జట్టు చీఫ్ ఫిజియో, చీఫ్ కోచ్, సెలెక్షన్ కమిటీ చైర్మన్దే ప్రధాన బాధ్యత. రోహిత్ గాయం గురించి ఈ ముగ్గురికీ తెలుసుంటుంది. అప్పుడు కోచ్ హోదాలో శాస్త్రి.. కెప్టెన్కు కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు. జట్టులో ఓ కీలక ఆటగాడి పరిస్థితి ఎలా ఉంది? అతనికేమైంది? లాంటి అంశాలేవీ చర్చకు రాకపోవడం మంచి పరిణామం కాదు’ అని గంభీర్ అన్నాడు.