మన భారతీయులకు సెన్సాఫ్ హ్యూమర్ లేదు: మాజీ క్రికెటర్ ఫరూఖ్
ABN , First Publish Date - 2020-09-27T23:23:26+05:30 IST
లాక్డౌన్ సమయంలో అనుష్కశర్మ బౌలింగ్లో కోహ్లీ ప్రాక్టీస్ చేయడం వల్లే ఐపీఎల్లో విరాట్ ఆడలేకపోతున్నాడంటూ సునీల్ గవాస్కర్ పేర్కొనడం
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో అనుష్కశర్మ బౌలింగ్లో కోహ్లీ ప్రాక్టీస్ చేయడం వల్లే ఐపీఎల్లో విరాట్ ఆడలేకపోతున్నాడంటూ సునీల్ గవాస్కర్ పేర్కొనడం వివాదాస్పదమైంది. క్రికెట్లోకి తననెందుకు లాగుతారంటూ అనుష్క ఇప్పటికే గవాస్కర్ను ప్రశ్నించగా, బాలీవుడ్ మహిళా నటులు కంగనా రనౌత్, జరీన్ ఖాన్లో కూడా గవాస్కర్ను తప్పుబట్టడంతో స్పందించిన లెజండరీ క్రికెటర్.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్నాడు. ఈ వివాదంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. సునీల్ గవాస్కర్ను ఎల్పప్పుడూ గౌరవించాలని ట్వీట్ చేస్తూ ఆయనకు అండగా నిలిచాడు.
తాజాగా, టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఫరూఖ్ ఇంజినీర్ కూడా గవాస్కర్కు మద్దతు పలికారు. కోహ్లీ, అనుష్కశర్మ గురించి గవాస్కర్ ఏదైనా మాట్లాడినా హాస్యంగా తీసుకోవాలి తప్పితే సీరియస్గా తీసుకోవడం తగదని హితవు పలికారు. మన ఇండియన్లకు సెన్సాఫ్ హ్యూమర్ లేదని, అందుకే గవాస్కర్ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నారని అన్నారు. ‘‘గవాస్కర్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన సరదాగా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు’’ అని చెప్పారు.
కాగా, ఇటీవల ప్రపంచకప్ సందర్భంగా ఫరూఖ్ కూడా అనుష్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుష్క శర్మకు సెలక్టర్లు చాయ్ కప్పులు అందించడంలో బిజీగా ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్తోపాటు అనుష్క కూడా స్పందించింది. అవసరం ఉన్నా, లేకపోయినా ప్రతిసారి తన పేరును బయటకు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
అప్పుడు కూడా ప్రజలు తన వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవడంతో అనుష్క స్పందించాల్సి వచ్చిందన్నారు. విరాట్ కోహ్లీకి అనుష్క అందమైన భార్య అని, తాను కానీ, గవాస్కర్ కానీ ఆమెను ఎందుకు విమర్శిస్తామని 82 ఏళ్ల ఫరూఖ్ పేర్కొన్నారు.