రైనాను వదిలేసినట్టేనా?
ABN , First Publish Date - 2020-09-01T09:49:15+05:30 IST
వ్యక్తిగత కారణాలతో అర్ధంతరంగా స్వదేశానికి వచ్చిన సురేశ్ రైనా.. ఇక భవిష్యత్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడతాడా? అనే సందేహాలు ,,

‘చెన్నై’ అసంతృప్తి
న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో అర్ధంతరంగా స్వదేశానికి వచ్చిన సురేశ్ రైనా.. ఇక భవిష్యత్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడతాడా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న ఈ జట్టు సభ్యుల్లో 13 మందికి కరోనా సోకడం కలకలం రేగింది. ఇందులో దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉండడంతో ఆందోళన పడిన రైనా ఐపీఎల్ను వీడినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే జట్టు క్వారంటైన్లో ఉన్న సమయంలో అతడి ప్రవర్తన సీఎ్సకే చీఫ్ శ్రీనివాసన్కు చికాకు తెప్పించినట్టు సమాచారం. ‘జట్టు నిబంధనల్లో భాగంగా కోచ్, కెప్టెన్, మేనేజర్లకు సూట్స్ ఇస్తుంటారు.
అయితే సీనియర్ ఆటగాడిగా రైనాకు జట్టు ఏ హోటల్లో దిగినా సూట్ కేటాయిస్తారు. కానీ ఈసారి అతనికిచ్చిన రూమ్కి బాల్కనీ లేదు. ఇది పెద్ద విషయమా? అంత మాత్రానికే భారత్కు తిరిగొస్తే ఎలా? ఈ సీజన్కైతే జట్టుకు దూరం ఉంటాడని అధికారికంగానే ప్రకటించారు. కానీ వచ్చే ఏడాది అతను ఆడతాడని చెప్పలేం. ఎందుకంటే అప్పటికి చాలాకాలం క్రికెట్కు దూరమయ్యే అతను నేరుగా సీఎ్సకేకు ఆడడం కష్టమే. బహుశా ఎవరైనా వేలం ద్వారా తీసుకుంటే ఇతర జట్టుకు ఆడతాడేమో’ అని చెన్నై అధికారి ఒకరు తేల్చారు.