2021లోనూ ధోనీనే..
ABN , First Publish Date - 2020-10-27T19:29:17+05:30 IST
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్కు దూరమైంది. కెప్టెన్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శనే దీనికి కారణం. ఈ నేపథ్యంలో...

దుబాయ్: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్కు దూరమైంది. కెప్టెన్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శనే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ధోనీ చేస్తున్న ఓ పని ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మ్యాచ్ అనంతరం తన చెన్నై జెర్సీలను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు బహుమానంగా ఇచ్చేస్తున్నాడు ధోనీ. ఈ నేపథ్యంలో ధోనీ ఆడే చివరి ఐపీఎల్ ఇదేనని పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై ధోనీ మాత్రం స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో అందరి అనుమానాలను, ఆందోళనలను దూరం చేస్తూ సీఎస్కే సీఈవో స్వామినాథన్ ఓ తీపికబురందించారు. అదేంటంటే 2021లో కూడా ధోనీయే చెన్నై జట్టు కెప్టెన్గా ఉంటారని ఆయన ప్రకటించారు. అయితే జట్టు ఓటమికి సురేశ్ రైనా, హర్భజన్ లేకపోవడం, కోవిడ్ కేసులు వెంటాడటం వంటి ప్రతికూల పరిస్థితులే కారణమని ఆయనన్నారు.
ఇదిలా ఉంటే సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాల్లో.. తొలి ఏడాది తమ జట్టు అద్భుతంగా ఆడి.. టైటిల్ గెలిచిందని, ఆ తర్వాతి సంవత్సరంలో చివరి బంతి వరకు పోరాడి ఓటమి చవిచూశామని, ఇక ఈ ఏడాది ఆటగాళ్లంతా సీనియర్లు కావడంతో దుబాయ్ పిచ్లు ప్రతికూలంగా మారాయని అన్నారు. జట్టు అవసరాలకు అనుగుణంగా మార్పులు జరగకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.