మళ్లీ గ్రౌండ్‌లోకి శ్రీశాంత్.. రంజీల్లో ఆడే అవకాశం

ABN , First Publish Date - 2020-06-18T21:34:44+05:30 IST

ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌‌కు దూరమైన పేసర్ శ్రీశాంత్ మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టనున్నారు. దీనికి కేరళ క్రికెట్ బోర్డు(కేసీఏ) కూడా గ్రీన్...

మళ్లీ గ్రౌండ్‌లోకి శ్రీశాంత్.. రంజీల్లో ఆడే అవకాశం

తిరువనంతపురం: ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌‌కు దూరమైన పేసర్ శ్రీశాంత్ మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టనున్నారు. దీనికి కేరళ క్రికెట్ బోర్డు(కేసీఏ) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరుతో శ్రీశాంత్‌పై ఉన్న నిషేధ కాలం ముగియనుండడంతో అతడిని రంజీల్లోకి తీసుకోనున్నట్లు కేరళ క్రికెట్ బోర్డు తెలిపింది. కేరళ బోర్డు ప్రధాన కోచ్ టినూ యోహానన్ దీనిపై స్పందిస్తూ, శ్రీశాంత్‌ను తిరిగి రంజీల్లోకి తీసుకునే అవకాశం ఉందని, అయితే అతడు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే విషయాన్ని కేసీఏ అధ్యక్షుడు సంజన్ కే వర్ఘీస్ కూడా ఇదే మాట చెప్పినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే శ్రీశాంత్ క్రికెట్‌లో పునరాగమనం చేసే సమయం చాలా దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. 


ఇదిలా ఉంటే 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకుగానూ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించారు. అతడితోపాటు రాజస్థాన్ రాయల్స్‌కే చెందిన అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు కూడా క్రికెట్‌కు జీవితకాలం దూరమయ్యారు. అయితే దీనిపై కోర్టుకెక్కిన శ్రీశాంత్ రెండేళ్ల పాటు పోరాడి ఎలాగోలా జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించుకున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు‌తో అతడి నిషేధ గడువు పూర్తి కానుంది.

Updated Date - 2020-06-18T21:34:44+05:30 IST