హైదరాబాద్ ఓపెన్ రద్దు
ABN , First Publish Date - 2020-06-05T09:20:22+05:30 IST
కరోనా కారణంగా హైదరాబాద్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీ రద్దయింది. ఆగస్టు 11 నుంచి 16 వరకు ఈ టోర్నీని షెడ్యూల్ చేశారు. కానీ, దేశంలో...
న్యూఢిల్లీ: కరోనా కారణంగా హైదరాబాద్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీ రద్దయింది. ఆగస్టు 11 నుంచి 16 వరకు ఈ టోర్నీని షెడ్యూల్ చేశారు. కానీ, దేశంలో వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం అనుమతించడం లేదన్న విషయాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్).. బీడబ్ల్యూఎఫ్కు తెలిపింది. దీం తో హైదరాబాద్ ఓపెన్ను రద్దు చేస్తున్నట్టు బీడబ్ల్యూఎఫ్ గురువారం ప్రకటించింది. ‘కొన్ని దేశాలు, ప్రాంతాల్లో పరిస్థితులు నిత్యం మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ గురించిన సమాచారాన్ని అవసరమైన సమయంలో అప్డేట్ చేస్తాం. హైదరాబాద్ ఓపెన్ రద్దు నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింద’ని బీడబ్యూఎఫ్ సెక్రటరీ జనరల్ థామస్ లుండ్ చెప్పారు. కాగా, హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఆగస్టులో టోర్నీ నిర్వహణకు సమ్మతి తెలపడం కష్టమని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చెప్పాడు. ‘ప్రస్తుతం హైదరాబాద్లో లాక్డౌన్ అమల్లో ఉంది. కేంద్రం అనుమతించినా..తెలంగాణ సర్కార్ మాత్రం క్రీడల పునరుద్ధరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం’ అని గోపీ చెప్పాడు.
అశ్విని, లక్ష్యసేన్ల ప్రాక్టీస్..
లాక్డౌన్ కారణంగా రెండు నెలలపాటు కోర్టుకు దూరమైన షట్లర్లు మళ్లీ ప్రాక్టీస్ ఆరంభించారు. టాప్ ప్లేయర్లు అశ్వినీ పొన్నప్ప, లక్ష్యసేన్తో పాటు మరో 20 మంది భారత ఆటగాళ్లు బెంగళూరులోని ప్రకాష్ పడుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీలో సాధన మొదలెట్టారు.