ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు.. ఎవరు కొడితే వాళ్లే బాల్ తేవాలి!
ABN , First Publish Date - 2020-03-13T18:07:17+05:30 IST
ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే.

సిడ్నీ: ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. కోవిడ్-19(కరోనా వైరస్) ఆందోళనల నేపథ్యంలో క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని క్రీడా ఫెడరేషన్లతోపాటు బీసీసీఐకి ఈ కీలక సూచన చేసింది. కేంద్రం నిర్ణయంతో తాజాగా జరగనున్న భారత్-సౌతాఫ్రికా మ్యాచ్లతో పాటు త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్లు బోసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట బోలెడు సెటైర్లు షికారు చేస్తున్నాయి. నెటిజన్ల క్రియేటీవిటి నవ్వులు పూయిస్తోంది.
ప్రముఖ క్రీడా ఛానెల్ ఈఎస్పీఎన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. బోసిపోయిన స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. స్టాండ్స్లో పడ్డ బంతిని ఓ ఫీల్డర్ స్వయంగా తనే తీసుకుని గ్రౌండ్లోకి విసురుతాడు. ఈ వీడియోను అప్లోడ్ చేసిన ఈఎస్పీఎన్.. ‘ఫ్యాన్స్ లేకపోతే జీవితం చాల కష్టంగా ఉంటుంది’ అంటూ సెటైరికల్ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇది చోటు చేసుకుంది. ఈ ట్వీట్పై నెట్టింట భలే జోకులు పేలుతున్నాయి. ఎవరు కొడితే.. వాళ్లే బాల్ తెచ్చుకోవాలి అని ఒకరంటే.. ఇది గల్లీ క్రికెట్ని తలపిస్తోంది అని మరొకరు ట్వీట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్లో ఆటగాళ్లు కూడా కోవిడ్ వైరస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వికెట్ పడిన ఆనందంలో ఆటగాళ్లు ఒకరి చేతులతో మరొకరి చేతులను గట్టిగా చరుస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే కివీస్ ఆటగాళ్లు అలా చేయకుండా .. తమ మోచేతులను తగిలించుకుని ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.