అరెస్ట్ చేసిన అధికారికి కిడ్నీని దానం చేసిన మహిళ!
ABN , First Publish Date - 2020-09-12T18:30:59+05:30 IST
అరెస్టు చేసిన పోలీసు అధికారి ప్రాణాలను కాపాడి.. ఓ మహిళ అందరి ప్రశంసలు పొందుతోంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న పోలీసు అధికారికి కిడ్నీని దానం

వాషింగ్టన్: అరెస్టు చేసిన పోలీసు అధికారి ప్రాణాలను కాపాడి.. ఓ మహిళ అందరి ప్రశంసలు పొందుతోంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న పోలీసు అధికారికి కిడ్నీని దానం చేసి మానవత్వం చాటుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన 40 ఏళ్ల జోసెలిన్ జేమ్స్ అనే మహిళ డ్రగ్స్కు బానిసైంది. దీంతో ఆమెను అక్కడి పోలీసులు మోస్ట్వాంటెడ్ లిస్ట్లో చేర్చి.. 2007 నుంచి 2012 మధ్య సుమారు 16సార్లు అరెస్టు చేశారు. మెరుగైన వైద్యం, కౌన్సెలింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె సాధారణ స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో ఫేస్బుక్లో ఓ పోస్ట్ చూసి ఆమె షాక్కు గురైంది. డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేసిన పోలీసు అధికారి టెర్రెల్ పాటెర్కు రెండు కిడ్నీలు పాడైపోయాయని.. గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీని దానం చేసే వారి కోసం ఆయన ఎదురుచూస్తున్నాడని తెలుసుకుంది. దీంతో తన కిడ్నీని టెర్రెల్ పాటెర్కు దానం చేయాలని జోసెలిన్ జేమ్స్ నిర్ణయించుకుంది. అదే విషయాన్ని జోసెలిన్ జేమ్స్.. టెర్రెల్ పాటెర్ కూతురుని సంప్రదించి వివరించింది. ఈ క్రమంలో జోసెలిన్ జేమ్స్కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. శస్త్రచికిత్స ద్వారా ఆమె కిడ్నీని టెర్రెల్ పాటెర్కు అమర్చారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం బాగానే ఉందని నాష్విల్లేలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ వైద్యులు తెలిపారు.