యూఏఈలో చిక్కుకున్న భారతీయులకు ఉచిత వసతి!

ABN , First Publish Date - 2020-12-25T22:08:55+05:30 IST

బ్రిటన్‌లో బయటపడిన కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ కారణంగా సుమారు 300 మంది భారతీయులు

యూఏఈలో చిక్కుకున్న భారతీయులకు ఉచిత వసతి!

అబుధాబి: బ్రిటన్‌లో బయటపడిన కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ కారణంగా సుమారు 300 మంది భారతీయులు యూఏఈలో చిక్కుకున్నారు. వారందరి ప్రస్తుతం ఉచిత వసతి దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పొట్టకూటి కోసం దాదాపు 300 మంది భారతీయులు సౌదీ అరేబియా, కువైట్‌కు ఈ నెల ప్రారంభంలో బయల్దేరారు. ఆయా దేశాలకు డైరెక్ట్ విమానాలు అందుబాటులోకి లేకపోవడంతో మొదట యూఏఈకి వెళ్లి, అక్కడ నుంచి గమ్య స్థానాలకు చేరుకోవాలని భావించారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యూఏఈ చేరుకున్నారు. యూఏఈలోని నిబంధనల ప్రకారం.. వారంతా 14 రోజులపాటు క్వారెంటైన్‌లో గడిపారు. తీరా వారి క్వారంటైన్ గడువు ముగిసి.. సౌదీ అరేబియా, కువైట్ వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా.. బ్రిటన్‌లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ బయటపడింది. 



దీంతో చాలా దేశాలు తమ సరిహద్దులను మూసేశాయి. అందులో సౌదీ అరేబియా, కువైట్ కూడా ఉండటంతో ప్రస్తుతం వారంతా యూఏఈలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఇండియన్ కల్చరల్ ఫౌండేషన్ (ఐసీఎఫ్) స్పందించింది. భవన నిర్మాణరంగానికి చెందిన వ్యాపారులతో మాట్లాడి.. 300 మంది భారతీయులకు వసతి కల్పించింది. ఈ సందర్భంగా ఐసీఎఫ్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. యూఏఈలో చిక్కుకున్న 300 మంది భారతీయులను తమ అతిథులుగా పేర్కొన్నారు. మంచి మనసు ఉన్న వ్యాపారులు యూఏఈలో చాలా మంది ఉన్నట్టు చెప్పారు. వారందరి సహకారంతో ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కూడా కల్పించినట్టు వెల్లడించారు.


Updated Date - 2020-12-25T22:08:55+05:30 IST