ప్రవాసులకు ఆ సర్టిఫికేట్ను తప్పనిసరి చేయడం సరికాదు: మురళీధరన్
ABN , First Publish Date - 2020-06-18T16:44:19+05:30 IST
ల్ఫ్ దేశాల నుంచి కేరళకు వచ్చే ప్రవాసులకు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ మండిపడ్డారు.
కోజికోడ్: గల్ఫ్ దేశాల నుంచి కేరళకు వచ్చే ప్రవాసులకు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ మండిపడ్డారు. ఈ నిర్ణయం స్వదేశానికి తిరిగి రావాలనుకునే ప్రవాసులకు ప్రతికూలమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పించుకుంటుందని మంత్రి ఆరోపించారు. కేరళ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై బయట అందరూ నవ్వుకుంటున్నారని విమర్శించారు. విదేశాల నుంచి వచ్చే ప్రవాసులకు దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు క్వారంటైన్, పరీక్షలు నిర్వహిస్తుంటే... కేరళ మాత్రం ఇలా బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
ఈ సమస్యపై రాష్ట్రం తన వైఖరిని మార్చుకోకపోతే 'వందే భారత్ మిషన్'లో భాగంగా కేరళకు విమాన సర్వీసులను నిలిపివేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అంతేగాక ఒక కేరళ వ్యక్తిగా తాను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. అలాగే రాయబార కార్యాలయాల ద్వారా తిరిగి వచ్చే ప్రవాసులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడం ఆచరణాత్మకం కాదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వివిధ దేశాలలో వారి సొంత ప్రోటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.