భారత్కు ట్రంప్ రిటర్న్ గిఫ్ట్.. అడగ్గానే హైడ్రాక్సీక్లోరోక్విన్ పంపినందుకు..
ABN , First Publish Date - 2020-04-15T21:36:54+05:30 IST
కొవిడ్-19 నియంత్రణలో భాగంగా అమెరికా ప్రభుత్వం కోరిన వెంటనే భారత ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్విన్ను అమెరికాకు ఎగుమతి చేసిన విషయం
![భారత్కు ట్రంప్ రిటర్న్ గిఫ్ట్.. అడగ్గానే హైడ్రాక్సీక్లోరోక్విన్ పంపినందుకు..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020041504051021/04152020160648n21.gif)
వాషింగ్టన్: కొవిడ్-19 నియంత్రణలో భాగంగా అమెరికా ప్రభుత్వం కోరిన వెంటనే భారత ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్విన్ను అమెరికాకు ఎగుమతి చేసిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్విన్ను పంపినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇదిలా ఉండగా.. తాజాగా భారత ప్రభుత్వం చేసిన సహాయానికి ట్రంప్ భారత్కు రిటర్న్ గిఫ్ట్ ప్రకటించారు. శత్రువుల నుంచి రక్షణకు అవసరమైన మిలిటరీ హార్డ్వేర్ను భారత్కు అమ్మనున్నట్టు ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్కు సమాచారమిచ్చారు. అమెరికా ప్రభుత్వం భారత్కు 10 ఏజీఎం-84ఎల్ హార్పూన్ బ్లాక్ || మిస్సైల్స్ను అమ్మేందుకు అంగీకరించింది. వీటితో పాటు 16 ఎమ్కే 54 లైట్ వెయిట్ టార్పెడోస్ను, మూడు ఎమ్కే 54 ఎక్ససైజ్ టార్పెడోస్లను భారత్కు అమ్మనుంది. ఎమ్కే 54 లైట్ వెయిట్ టార్పెడో.. జలాంతర్గామి వ్యతిరేక యుద్ద కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మిస్సైల్స్, టార్పెడోస్తో కలిపి ఈ డీల్ మొత్తం విలువ 155 మిలియన్ డాలర్లుగా ఉంది.
హార్పూన్ మిస్సైల్స్, టార్పెడోస్ పీ-8ఐ ఎయిర్క్రాఫ్ట్లో భాగమవుతాయని అమెరికా రక్షణ రంగం తెలిపింది. బోయింగ్ సంస్థ తయారుచేసిన పీ-8ఐ ఎయిర్క్రాఫ్ట్స్లో హార్పూన్ మిస్సైల్స్, లైట్ వెయిట్ టార్పెడోస్తో పాటు శత్రువుల జలంతర్గాములను కనిపెట్టి ధ్వంసం చేసే రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుంది. 2009లో భారత ప్రభుత్వం 2.1 బిలియన్ డాలర్ల వ్యయంతో ఎనిమిది పీ-8ఐ ఎయిర్క్రాఫ్ట్స్ కొనుగోలుకు ఒప్పందం కుదర్చుకుంది. 2016 జులైలో 1.1 బిలియన్ డాలర్లకు మరో నాలుగు పీ-8ఐ ఎయిర్క్రాఫ్ట్స్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2022కి ఈ నాలుగు ఎయిర్క్రాఫ్ట్స్ భారత రక్షణ రంగానికి చేరే అవకాశం ఉంది. ఇక గత నవంబర్లో 1.8 బిలియన్ డాలర్లతో మరో ఆరు పీ-8ఐ ఎయిర్క్రాఫ్ట్స్ కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్ ప్రతిపాదించింది.
హార్పూన్ మిస్సైల్స్ను బోయింగ్ సంస్థ తయారుచేయగా, టార్పెడోస్ను రేథియాన్ సంస్థ తయారుచేసింది. శత్రువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ ఆయుధాలు భారత్కు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా ఈ డీల్ భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని కూడా బలపరచనుంది. కాగా.. ఈ రెండు మిలిటరీ హార్డ్వేర్స్ కావాలని భారత ప్రభుత్వం గతంలో అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ రూపంలో భారత్ అమెరికాను ఆదుకోవడంతో.. ఇప్పుడు భారత ప్రభుత్వ కోరికను అమెరికా తీర్చుతోంది. కాగా.. భారత్-అమెరికాల మధ్య 2007 నుంచి ఇప్పటివరకు దాదాపు 21 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఇటీవల ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో మూడు బిలియన్ డాలర్లు విలువ చేసే 24 ఎమ్హెచ్-60 రోమియో మల్టీ రోల్ నావల్ హెలికాప్టర్స్, ఆరు అపాచి అటాక్ చాపర్స్ అమ్మేందుకు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.