భారత సంతతి డ్యాన్సర్ను ‘పాయింట్స్ ఆఫ్ లైట్’తో గౌరవించిన యూకే ప్రధాని
ABN , First Publish Date - 2020-08-02T01:19:57+05:30 IST
లాక్డౌన్ సమయంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు, కరోనాను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందన్న ఉద్దేశంతో ఆన్లైన్లో భారత

లండన్: లాక్డౌన్ సమయంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు, కరోనాను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందన్న ఉద్దేశంతో ఆన్లైన్లో భారత సంప్రదాయ నృత్యం భాంగ్రాను బోధించినందుకు గాను భారత సంతతి నృత్యకారుడు రాజీవ్ గుప్తా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి పాయింట్స్ ఆఫ్ లైట్ గౌరవాన్ని అందుకున్నారు. తన క్లాసులను సోషల్ మీడియా ద్వారా ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు గాను గత నెలలో ఆయనకు పాయింట్ ఆఫ్ లైట్ గౌరవం లభించింది. సమాజంలో మార్పు కోసం చేస్తున్న అత్యుత్తమ వలంటీర్లకు యూకే ప్రధాని ప్రతి వారం ఇచ్చే గౌరవం ఇది.
"గత కొన్ని నెలలుగా మీ ఆన్లైన్ భాంగ్రా తరగతులు దేశంలోను, దేశం వెలుపల పాల్గొనేవారి శక్తిని పెంచాయి’’ అని గుప్తాకు వ్యక్తిగతంగా పంపిన లేఖలో ప్రశంసించారు. ఈ క్లిష్ట సమయంలో మీరు చాలా మందికి పాయింట్ ఆఫ్ లైట్గా నిలిచారని, ఈ విధంగా మిమ్మల్ని గుర్తించగలిగినందుకు తాను సంతోషిస్తున్నానని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ పురస్కారం లభించినందుకు తాను నిజంగా కృతజ్ఞుడినని, ఇది ఇంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుందని తానెప్పుడూ అనుకోలేదని గుప్తా అన్నారు. మాంచెస్టర్, బర్మింగ్హామ్, రీడింగ్లలో గుప్తా గత 15 ఏళ్లుగా డ్యాన్స్ ఫిట్నెస్ క్లాసులు నిర్వహిస్తున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్లో ప్రారంభ కార్యక్రమంలోనూ భాంగ్రాను ప్రదర్శించారు.