కరోనాతో యూఏఈ కకావికలం.. రోజురోజుకీ భారీగా పెరుగుతున్న బాధితులు
ABN , First Publish Date - 2020-04-26T15:10:43+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లో నెట్టేసింది. ప్రస్తుతం 'కొవిడ్-19' కోరల్లో చిక్కుకుని అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడుతున్నాయి.

యూఏఈ: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లో నెట్టేసింది. ప్రస్తుతం 'కొవిడ్-19' కోరల్లో చిక్కుకుని అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడుతున్నాయి. గల్ఫ్లో కూడా ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం యూఏఈ కరోనా దెబ్బకు కకావికలమవుతోంది. శనివారం ఒక్కరోజే 532 కొత్త కేసులు నమోదు కావడం అక్కడ ఈ వైరస్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియజేస్తోంది. ఈ 532 కొత్త కేసులతో కలిపి యూఏఈలో కరోనా బాధితుల సంఖ్య 9,813కి చేరిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 127 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,887కి చేరింది. కాగా, శనివారం సంభవించిన ఏడు కొత్త మరణాలతో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారు 71 మంది అయ్యారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇక ఈ మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా టెస్టులు ముమ్మరం చేసిన యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా ఒక మిలియన్ మందికి పరీక్షలు నిర్వహించడం విశేషం. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్ రెహ్మాన్ బిన్ ముహమ్మద్ అల్ ఓవైస్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 14 కేంద్రాల్లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, దేశంలో 'కొవిడ్-19' విజృంభిస్తున్నందున ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. సామాజిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత శుభ్రతతో మాత్రమే ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టగలమని ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.