సౌదీ, యూఏఈలో 'కరోనా' పంజా.. ఒకేరోజు భారీగా పెరిగిన కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-04-12T12:58:38+05:30 IST
యూఏఈలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శనివారం ఒక్కరోజే ఇక్కడ 376 కొత్త కేసులు నమోదయ్యాయి.
రియాధ్: యూఏఈలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శనివారం ఒక్కరోజే ఇక్కడ 376 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యూఏఈలో కరోనా బాధితుల సంఖ్య 3,736కి చేరింది. ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రతినిధి డా. ఫరీదా అల్ హోసాని మాట్లాడుతూ కరోనా బాధితుల్లో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని, ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు తెలిపారు. శనివారం 170 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని, దీంతో ఇప్పటివరరకు కోలుకున్న వారి సంఖ్య 588 అయ్యిందని ఆమె చెప్పారు. అలాగే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 20 మంది 'కొవిడ్-19' వల్ల చనిపోయినట్లు ఫరీదా అల్ హోసాని వెల్లడించారు. మరోపక్క దేశ పౌరులు, ప్రవాసులకు కరోనా టెస్టులు చేయడం ముమ్మరం చేసింది యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. శనివారం నాడు 20 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది. దీంతో యూఏఈలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 6,48,195 అయ్యిందని ఆమె పేర్కొన్నారు.
అటు సౌదీ అరేబియాలో కూడా మహమ్మారి కరోనావైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 382 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు సౌదీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4033కి చేరింది. అలాగే 35 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, మరో ఐదుగురు మృతి చెందారని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో కొవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 720కి చేరగా, చనిపోయిన వారి సంఖ్య 52కి చేరింది.