యూఏఈలో పంజా విసురుతున్న 'కరోనా'... ఒకేరోజు 283 కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-04-08T15:16:17+05:30 IST
తాజాగా యూఏఈలో కరోనా పంజా విసురుతోంది. మంగళవారం ఒక్కరోజే 283 కొత్త కేసులు నమోదు కావడం అక్కడ ఈ వైరస్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియజేస్తోంది.

యూఏఈ: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లో నెట్టేసింది. ప్రస్తుతం 'కొవిడ్-19' కోరల్లో చిక్కుకుని అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడుతున్నాయి. గల్ఫ్లో కూడా ఈ మహమ్మారి వీర విహారం చేస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. తాజాగా యూఏఈలో కరోనా పంజా విసురుతోంది. మంగళవారం ఒక్కరోజే 283 కొత్త కేసులు నమోదు కావడం అక్కడ ఈ వైరస్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియజేస్తోంది. ఈ 283 కొత్త కేసులతో కలిపి యూఏఈలో కరోనా బాధితుల సంఖ్య 2,359కి చేరిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే 19 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 186కి చేరింది. కాగా, మంగళవారం చనిపోయిన ఓ ఆసియా వాసితో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారు 12 మంది అయ్యారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో 'కొవిడ్-19' విజృంభిస్తున్నందున ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలన్నారు. సామాజిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత శుభ్రతతో మాత్రమే ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టగలమని ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.