యూఏఈలో ఆగని కొవిడ్ ఉధృతి !
ABN , First Publish Date - 2020-11-15T13:28:40+05:30 IST
యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 1,25,915 కరోనా పరీక్షల్లో 1,174 మందికి పాజిటివ్గా వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అబుధాబి: యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 1,25,915 కరోనా పరీక్షల్లో 1,174 మందికి పాజిటివ్గా వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 1,49,135కు చేరింది. అలాగే నిన్న 678 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి కావడంతో మొత్తం రికవరీలు 1,42,561కు చేరాయి. కాగా, ఇప్పటివరకు యూఏఈ వ్యాప్తంగా 528 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,046 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముమ్మరంగా కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న యూఏఈ... ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా 14.7 మిలియన్ల కరోనా పరీక్షలు పూర్తి చేసింది.
ఇదిలా ఉంటే.. శుక్రవారం యూఏఈ అధికారులు కీలక ప్రకటన చేశారు. యూఏఈ అంతటా భూ సరిహద్దులు సోమవారం తిరిగి తెరవనున్నట్లు ప్రకటించారు. కానీ, కొవిడ్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని సూచించారు. ఒమన్ పౌరులకు ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేకుండానే దేశంలోకి ప్రవేశానికి అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, ఒమనీస్ తప్పకుండా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలని, అది కూడా వారి దేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబొరేటరీ నుంచి తీసుకున్నది అయ్యి ఉండాలని సూచించారు. ఇక కొవిడ్ విజృంభణ నేపథ్యంలో మార్చి నుంచి ఒమన్, యూఏఈ మధ్య సరిహద్దును క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి సందర్భంగా భారతీయ ప్రవాసులు కూడా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా వేడుకలు చేసుకోవాలని అధికారులు సూచించారు. గుంపులు గుంపులుగా ఒక్కచోట చేరకుండా, పరిమిత సంఖ్యలో బంధులు, స్నేహితులతో కలిసి పండుగ జరుపుకోవాలని తెలిపారు.