యూఏఈలో విస్తరిస్తున్న మహమ్మారి.. 48 గంటల్లో 40వేల మందికి కరోనా టెస్టులు
ABN , First Publish Date - 2020-04-10T15:09:05+05:30 IST
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అటు గల్ఫ్ దేశాల్లో కూడా తన ఉనికిని చాటుతోంది.
యూఏఈ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అటు గల్ఫ్ దేశాల్లో కూడా తన ఉనికిని చాటుతోంది. ఈ మహమ్మారి రోజురోజుకీ గల్ఫ్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. యూఏఈలో విజృంభిస్తున్న 'కొవిడ్-19' ధాటికి గురువారం ఒక్కరోజే 331 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2,990కి చేరింది. ఇద్దరు చనిపోగా, కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 14 అయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి వెల్లడించింది. కాగా, చనిపోయిన ఇద్దరూ కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు అధికారులు చెప్పారు. మరో 29 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 268కి చేరింది. అలాగే గడిచిన 48 గంటల వ్యవధిలో సుమారు 40వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించామని ఆరోగ్యశాఖ తెలిపింది.