ట్రంప్ భారత్‌కు పంపనున్న వెంటిలేటర్ల ధర ఎంతో తెలుసా?

ABN , First Publish Date - 2020-05-18T23:22:40+05:30 IST

భారత్‌కు 200 మొబైల్ వెంటిలేటర్లు విరాళంగా ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు

ట్రంప్ భారత్‌కు పంపనున్న వెంటిలేటర్ల ధర ఎంతో తెలుసా?

వాషింగ్టన్: భారత్‌కు 200 మొబైల్ వెంటిలేటర్లు విరాళంగా ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే. ‘భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంది. కరోనాపై పోరాటంలో, వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా - భారత్‌లు కలిసి పనిచేస్తున్నాయి’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.  కాగా.. అమెరికా పంపనున్న ఒక్కో మొబైల్ వెంటిలేటర్ ధర 13 వేల డాలర్ల(రూ. 9.6 లక్షలు)ని రిపోర్ట్ చెబుతోంది. మే చివరి నాటికి లేదా జూన్ మొదటి వారంలో ఈ వెంటిలేటర్లు భారత్‌కు చేరనున్నాయి. మొత్తం 200 మొబైల్ వెంటిలేటర్లకు గాను 2.6 మిలియన్ డాలర్ల(రూ. 19.2 కోట్ల) ఖర్చు కానుంది. ఈ ఖర్చును యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్ఏఐడీ) భరించనుంది. ఇదిలా ఉండగా.. ట్రంప్ ట్వీట్‌పై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ‘వెంటిలేటర్లను పంపుతున్నందుకు ధన్యవాదములు. ఈ మహమ్మారిపై అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. కొవిడ్-19 నుంచి విముక్తి పొందేందుకు, ప్రపంచాన్ని మరింత ఆరోగ్యవంతంగా చేసేందుకు దేశాలుగా మనం కలిసి పనిచేయాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. ఏప్రిల్‌లో ట్రంప్ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం 5 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను అమెరికాకు ఎగుమతి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. 

Updated Date - 2020-05-18T23:22:40+05:30 IST