ట్రంప్ తన ఓటమిని అంగీకరించినట్టేనా?

ABN , First Publish Date - 2020-11-15T09:31:50+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఒకపక్క ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు జో బైడెన్ సిద్దమవుతున్నారు. అయినప్పటికి ట్రంప్ తన ఓటమిని అంగీకరించడం లేదు. అయితే తాజాగా జో బైడెన్ జార్జియాలో గెలుపు సాధించడంతో ఆయన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 306కు చేరింది.

ట్రంప్ తన ఓటమిని అంగీకరించినట్టేనా?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఒకపక్క ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు జో బైడెన్ సిద్దమవుతున్నారు. అయినప్పటికి ట్రంప్ తన ఓటమిని అంగీకరించడం లేదు. అయితే తాజాగా జో బైడెన్ జార్జియాలో గెలుపు సాధించడంతో ఆయన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 306కు చేరింది. దీంతో ట్రంప్ వైఖరిలో కూడా కొంచెం మార్పు వచ్చినట్టు కనపడుతోంది. ఇప్పటివరకు గెలుపు తనదేనంటూ చెప్పుకొచ్చిన ట్రంప్.. శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా ఉంటానో లేదో సమయమే చెబుతుందంటూ ట్రంప్ కొత్తగా మాట్లాడారు. 


శనివారం వైట్‌హౌస్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వం లాక్‌డౌన్‌లోకి వెళ్లదు. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం ఉంటుందో ఎవరికి తెలుసు? నాకు తెలిసి దీనికి సమాధానం సమయమే చెబుతుంది’ అని అన్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయన పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తున్నారనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు గెలుపు తమదేనంటూ చెప్పుకొచ్చిన ట్రంప్.. భవిష్యత్తే గెలుపెవరిదో నిర్ణయిస్తుందని చెప్పడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ట్రంప్ తన ఓటమిని కూడా అంగీకరిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోర్టులకు వెళ్లినా ఎటువంటి లాభం లేకపోవడంతో ఏం చేసినా తాను గెలిచే అవకాశాలు లేవనే ఆలోచనకు ట్రంప్ వచ్చేసినట్టు కనపడుతోంది. జనవరి 20 వరకు అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటారు. ఈ సమయంలో ట్రంప్ తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఏదైనా చేస్తారనే టాక్ నడిచింది. మరి రానున్న రోజుల్లో ట్రంప్ ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి. 

Updated Date - 2020-11-15T09:31:50+05:30 IST