'టీపాడ్' ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
ABN , First Publish Date - 2020-08-20T14:54:09+05:30 IST
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ప్రతీ సంవత్సరం డల్లాస్ నగరం టెక్సాస్ రాష్ట్రం అమెరికాలో బతుకమ్మ, దసరా వేడుకలను ప్రపంచంలోనే పెద్దఎత్తున నిర్వహిస్తోంది.

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ప్రతీ సంవత్సరం డల్లాస్ నగరం టెక్సాస్ రాష్ట్రం అమెరికాలో బతుకమ్మ, దసరా వేడుకలను ప్రపంచంలోనే పెద్దఎత్తున నిర్వహిస్తోంది. ప్రతీ వేసవిలో డాలస్ నగరవాసులందరికీ వనభోజనాలు పెడుతోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, పండగలను పాశ్చాత్య దేశాలలో ప్రతిభింబించేలా చేయడమే కాకుండా మన లలిత కళలకు జీవం పోస్తూ ఎంతో మంది కళాకారులకు గొప్ప వేదికను కలుగజేస్తుంది. ప్రతీ ఏటా రక్త దాన శిభిరాలతో పాటు, ఇల్లు, నీడ లేని వారికి అన్న దానాలు చేస్తూ పెద్ద ఆసరాగా నిలబడుతుంది. స్థానిక, జాతీయ సంస్థలు చేసే కార్యక్రమాలకి చేదోడై, తోడు నీడలా బాధ్యతలను తన భుజాలపై వేసుకుంటుంది. కరోనా లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా అమెరికాలోని ఆరోగ్య కేంద్రాలకు మాస్కులు, వైద్య పరంగా కావలసినవి సమకూర్చడమే కాకుండా, ఇండియా నుండి వచ్చిన విద్యార్థులకు కూడా కావాల్సిన నిరంతంర సహాయం చేస్తోంది.
టీపాడ్ సంస్థ చేసే కమ్యూనిటీ సర్వీసెస్లో భాగంగా మాతృభూమి ఇండియాలో కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న కారణంగా చాలా మంది నిరుపేదలు వారి ఉపాధి కోల్పోయారు. ఇలా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో కొన్ని కుటుంబాలు నిత్యావసరాలు కూడా సమకూర్చు కోలేని స్థితిలో ఉన్నాయని తెలుసుకున్న టీపాడ్ సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థ కార్యదర్శి అనురాధ మేకల, కొత్తగూడెం గ్రామస్థులు సతీష్, జ్యోతి, కాల్వ సుధాకర్, అక్రమ్, షాబుద్దీన్, శ్రీనివాస్, నాగారాజు, స్వరూప, జాత, మల్లేశ్వరి మున్నగు వారితో సంప్రదించి “కొత్తగూడెం సెయింట్ జోసెఫ్ హై స్కూల్”లో 25 కుటుంబాలకి ఒక మాసానికి సరిపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. టీపాడ్ సంస్థ నాయకత్వమైన ఫౌండింగ్ కమిటీ చైర్ రావు కల్వల, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్ మాధవి సుంకిరెడ్డి గారిక, కో ఆర్డినేటర్ బుచ్చి రెడ్డి గోలి, అధ్యక్షులు రవికాంత్ రెడ్డి మామిడి, కార్యవర్గ బృందానికి కొత్తగూడెం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, గ్రామస్థులు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
టీపాడ్ నాయకత్వం, సంస్థ కార్యవర్గ బృందంతో కలిసి కోవిడ్ ఆపద సమయంలో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లా నర్వ మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ విభాగాల్లో నిరంతరం సేవలందిస్తున్న వారికి దాదాపు వెయ్యిడాలర్ల విలువైన N-95 మాస్కులు, శానిటైజెర్లు పంపిణీ చేశారు. తరువాత ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణ జిల్లా కూచిపూడి గ్రామములో 20 కుటుంబాలకు ఒక మాసానికి సరిపడే నిత్యావసర వస్తువులను అందజేశారు. అదేవిధంగా కొత్త గూడెంలో కూడా 25 కుటుంబాలకి ఈ సహాయ కార్యక్రమం చేపడుతున్నందుకు, ఆపదలో ఉన్న వారికి చేయూతను అందిస్తున్నందుకు తమకెంతో ఆనందంగా ఉందన్నారు. మునుముందు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడానికి సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు.