థాయ్ రాజుకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు.. జనాల సొమ్మును వెనక్కు ఇచ్చేయమంటూ..

ABN , First Publish Date - 2020-11-27T04:58:25+05:30 IST

థాయ్ రాజుకు వ్యతిరేకంగా 15 వేల మంది ప్రజాస్వామ్య నిరసనకారులు గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

థాయ్ రాజుకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు.. జనాల సొమ్మును వెనక్కు ఇచ్చేయమంటూ..

బ్యాంకాక్: థాయ్ రాజుకు వ్యతిరేకంగా 15 వేల మంది ప్రజాస్వామ్య నిరసనకారులు గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. థాయ్ రాజు అతిపెద్ద వాటాదారుడుగా ఉన్న సియమ్ కమర్షియల్ బ్యాంకు(ఎస్‌సీబీ) ముందే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. థాయ్ రాజు వద్ద ఉన్న దాదాపు 60 బిలియన్ డాలర్ల(రూ. 4.42 లక్షల కోట్లు) సంపదను నియంత్రించాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. దేశానికి చెందిన సంపదను థాయ్ రాజు తిరిగి ఇచ్చేయాలంటూ వారంతా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంటే.. ప్రజల పన్ను మొత్తాన్ని ఒకే కుటుంబం విలాసవంతంగా ఖర్చు చేస్తోందంటూ నిరసనాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలు దాదాపు శాంతియుతంగానే జరిగినప్పటికి అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క రెండు గ్రూపుల మధ్య తగాదా జరిగినట్టు, ఒక వ్యక్తిపై కాల్పులు కూడా జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక నిరసన కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన 15 సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్టును అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఖండిస్తున్నాయి.

Updated Date - 2020-11-27T04:58:25+05:30 IST