నిరాడంబరంగా టాక్ లండన్ బోనాలు

ABN , First Publish Date - 2020-07-20T23:31:22+05:30 IST

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో బోనాల పండుగ

నిరాడంబరంగా టాక్ లండన్ బోనాలు

  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన నందిన సిధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, మామిడి హరికృష్ణ

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిన సిధారెడ్డి, తెలంగాణ సమాచారహక్కు చట్టం కమీషనర్ కట్టా శేఖర్ రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ టాక్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. టాక్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఘనంగా బోనాల జాతరను లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించుకుంటామని కార్యదర్శి శుష్మణ రెడ్డి తెలిపారు. కానీ.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తామంతా సంబరాలకు దూరంగా ఉంటూ సంస్థ తరపున సమాజానికి వీలైనంత సేవ చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కి ముందు బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి  ప్రజలంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నామన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ టాక్ కార్యవర్గ సభ్యులు స్థానిక గుడిలో  అమ్మవారికి బోనాలను సమర్పించి అందరిని చల్లగా చూడాలని, కరోనా నుంచి ప్రజలను రక్షించాలని కోరుకున్నట్టు కార్యదర్శి శుష్మణ రెడ్డి  తెలిపారు. 


అలాగే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజలు కూడా స్వీయ క్రమశిక్షణ పాటించాలని టాక్ సంస్థ తరపున అందరికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బోనాలు సమర్పించిన టాక్ సంస్థ ఆడబిడ్డలందరికి  కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ నాయకులు అనిల్ కూర్మాచలం, పవిత్ర కంది సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అతిథులకు వివరించారు. అలాగే  కార్యవర్గ కుటుంబసభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిన సిధారెడ్డి, తెలంగాణ సమాచారహక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ టాక్ సంస్థ తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు ఖండాంతరాల్లో చేస్తున్న కృషిని అభినందించారు. బోనాల పండుగ ప్రత్యేకత గురించి, తెలంగాణ సంస్కృతి పరిరక్షణకై  ప్రభుత్వం చేస్తున్న కృషి, ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాల గురించి నందిన సిధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, మామిడి హరికృష్ణ టాక్ సభ్యులకు వివరించారు. టాక్ సంస్థకు తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. 


టాక్ తరపున ముఖ్యనాయకులు మల్లా రెడ్డి - శుష్మణ దంపతులు వారి ఇంట్లో సంప్రదాయబద్దంగా అమ్మవారి పూజ నిర్వహించి ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుం అందరిని కాపాడాలని భక్తి శ్రద్దలతో పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా టాక్ సంస్థ నుంచి మల్లా రెడ్డి - శుష్మణ దంపతులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు శుష్మణరెడ్డి చెప్పారు. ఇక తెలంగాణ బోనాల పాటలతో ప్రముఖ గాయని స్వాతి రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారిని అలరించడమే కాకుండా, పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. గతేడాది ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చి పోతరాజు వేషధారణతో లండన్ వీధుల్లో ధూమ్ ధామ్ చేసిన జయ్ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పోతరాజు వేషధారణతో పాల్గొని బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పరిపూర్ణతను తెచ్చారు. చివరిగా టాక్ సభ్యులంతా ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు  ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే  అమ్మవారు ప్రజలందరిని రక్షించాలని ప్రార్థించారు. 

Updated Date - 2020-07-20T23:31:22+05:30 IST